Search Here

Oct 10, 2021

Arthur Neve | ఆర్థర్ నీవ్

ఆర్థర్ నీవ్ | Arthur Neve



  • జననం: 24-12-1859
  • మహిమ ప్రవేశం: 05-09-1919
  • స్వస్థలం: బ్రైటన్
  • దేశం: ఇంగ్లాండు
  • దర్శన స్థలము: పూర్వపు కాశ్మీర్

 ఆంగ్లేయుడైన ఆర్థర్ నీవ్ కాశ్మీర్‌లో తాను చేసిన సేవకు పేరుగాంచిన ఒక వైద్య మిషనరీ. తన బాల్యం నుండి కూడా అతను యేసుక్రీస్తు యొక్క స్వస్థ పరిచే పరిచర్య పట్ల ఆకర్షితులయ్యారు. అతను కేవలం ఒక వైద్యుడు అవ్వాలని కోరుకొనక శరీరాత్మలను రెండింటినీ స్వస్థపరచగల వైద్య మిషనరీ కావాలని వాంఛించారు. కాగా, ఈడెన్‌బర్గ్ విశ్వవిద్యాలయం నుండి వైద్య శాస్త్రంలో పట్టభద్రులైన అతను, మిషనరీ సేవ చేయుటకు ఉగాండాకు వెళ్ళవలెనని కోరుకున్నారు.

 అయితే, కాశ్మీర్ మిషన్‌లో అత్యవసరంగా సహాయం కావలెనని అతనికి పిలుపు వచ్చింది. కావున, భారతదేశానికి పయనమైన అతను, 1882వ సంll లో శ్రీనగర్‌కు చేరుకున్నారు. ముస్లింలు మరియు హిందువులకు ఆశ్రయమిస్తున్న కాశ్మీర్ ఉద్రిక్తతతో నిడుకొనియున్న ఒక ప్రదేశం మరియు అందులో క్రైస్తవులకు చోటు లేదు. ఈనాటికి కూడా కాశ్మీర్‌లో దాదాపు ఇదే పరిస్థితి నెలకొనియుంది. తాను ఒక ఆంగ్లేయుడు కావడంతో స్థానికుల యొక్క నమ్మకమును పొందడం నీవ్‌కు మరింత కష్టతరమైన విషయం. అయితే, తన ప్రేమపూర్వక పనులతో అతను సమాజంలోని అన్ని వర్గాలలోను స్నేహితులను సంపాదించుకొనగలిగారు. త్వరలోనే అతని సోదరుడు ఎర్నెస్ట్ నీవ్ కూడా అతనితో చేరగా, వారిరువురు కలిసి కాశ్మీర్ ప్రజల సంక్షేమం కొరకు వారి చెమటోడ్చి శ్రమించారు.

 ఒక వైద్యునిగా నీవ్ పోరాడుతున్నది కేవలం వ్యాధులతో కాదు, ప్రజల యొక్క మూఢనమ్మకాలు మరియు అజ్ఞానములతో కూడా. నీవ్ ఇచ్చిన మందులు వాడితే అవి వారి మనస్సుపై పనిచేసి వారిని క్రైస్తవులుగా మారుస్తాయని స్థానికులు భావించారు. కొన్నిసార్లు రోగులకు శస్త్రచికిత్స చేయుటకు వారికి అపస్మారక స్థితిని కలుగజేసినప్పుడు, వైద్యుడు రోగిని చంపారనుకొని ప్రజలు అతనిపై కర్రలతో దాడి చేసిన సంఘటనలు కూడా ఉన్నాయి. తన పిలుపులో నమ్మకముగా నిలబడుటకు ఆ శ్రమలన్నింటినీ సహనముతో భరించారు నీవ్.

 క్రమక్రమంగా మిషన్ అభివృద్ధి చెంది, ఉత్తర భారతదేశమంతటి నుండి వేలాది మంది రోగులు ఆ ఆసుపత్రికి రావడం ప్రారంభమయ్యింది. రోగులకు వైద్య సహాయమందించుటకు నీవ్ చేసే సంప్రదింపులు ఎల్లప్పుడు కూడా వారి ఆత్మలకు కూడా సువార్త అనే ఔషధమును ఇచ్చేవిగా ఉంటాయి. నిర్విరామంగా ఉండే అతని పని మధ్య కూడా అతను సువార్త సేవకు ఏనాడూ ఆటంకం కలిగించలేదు. ప్రతి రోగిని దర్శించి, వారికి దేవుని వాక్యము ద్వారా ఆదరణను కలిగించుటకు అతను పాదిరులను నియమించారు. అంతేకాకుండా, అతను తరచుగా కొండలను ఎక్కి అక్కడ ఉండే గ్రామాలలో వైద్య శిబిరాలను నిర్వహించేవారు. యేసు క్రీస్తు తన గ్రామంలోని ప్రజలను మాత్రమే స్వస్థపరచలేదు గానీ, ఆయన దేశమంతటా ప్రయాణించారు అని నీవ్ తరచూ చెప్పేవారు. 

 “డాక్టర్ సాహిబ్” అని తనను ప్రేమగా గుర్తుంచుకునే కాశ్మీరీ ప్రజలకు కరువులు, తెగుళ్ళు, భూకంపాలు మరియు యుద్ధాల మధ్య కూడా వెనుకంజవేయక చివరి వరకూ సేవలందించారు ఆర్థర్ నీవ్.

ప్రియమైనవారలారా, కాశ్మీర్‌లో నశించుచున్న ఆత్మల కొరకు మీకు భారం ఉందా?

"ప్రభువా, కాశ్మీర్‌లో సమాధాన సువార్త కొరకు ద్వారము తెరువుము. ఆమేన్!"

దేవునికే మహిమ కలుగునుగాక!
  • WhatsApp
  • No comments:

    Post a Comment