Search Here

Aug 2, 2021

Margaret Cargill | మార్గరెట్ కార్గిల్

మార్గరెట్ కార్గిల్  | Margaret Cargill 


  • జననం: 28-09-1809
  • మహిమ ప్రవేశం: 28-06-1840
  • స్వదేశం: స్కాట్లాండు, యునైటెడ్ కింగ్‌డమ్
  • దర్శన స్థలము: తోంగా మరియు ఫిజి దీవులు


దక్షిణ పసిఫిక్‌ దీవులలో మిషనరీ పరిచర్య ప్రాణాంతకమైనదిగాను మరియు మిక్కుటమైన లేమితో కూడుకున్నదిగాను ఉన్నటువంటి రోజులలో ఫిజీ మిషన్ యొక్క మార్గదర్శక మిషనరీలలో ఒకరిగా నిలిచారు మార్గరెట్ కార్గిల్. డేవిడ్ కార్గిల్‌తో ఆమెకు వివాహం జరిగిన తరువాత, ఈ మిషనరీ దంపతులు 1832వ సంll లో తోంగా ద్వీపసమూహానికి పయనమయ్యారు. 


వవావు ద్వీపసమూహానికి చేరుకున్న వెంటనే మార్గరెట్ అమితమైన ఉత్సాహముతో ఎంతో శ్రద్ధాసక్తులు కలిగి మిషనరీ పరిచర్యను ప్రారంభించారు. అక్కడి ప్రజలు అర్థం చేసుకొనగలిగేంత మేరకు స్థానిక భాషలో మాట్లాడగలిగిన వెంటనే ఆమె వృద్ధ మహిళలను వారి గుడిసెలలో సంధించి, దేవుని అత్యున్నతమైన ప్రేమను గురించి వారికి తెలియచెప్పారు. తదుపరి ఆమె పాఠశాలలలో బోధించడం ప్రారంభించారు మరియు యువతులకు మరియు బాలికలకు మహిళా సంబంధిత కళలను బోధించుటకు తరగతులను ఏర్పాటు చేశారు. అన్ని తరగతులకు లౌకికపరమైన బోధన మాత్రమే కాక ఆత్మీయపరమైన బోధనను కూడా ఆమె అందించారు. సహృదయముతోను మరియు సహనముతోను బోధించే ఆమె, తాను సంధించిన ప్రతి ఒక్కరి హృదయాభిమానాలను చూరగొన్నారు.


మొదటిగా ఫిజీ ద్వీపాలలోని లకెంబాలో నరమాంసభక్షకులైన ప్రజల మధ్యలో కార్గిల్ దంపతులు నియమించబడ్డారు. అక్కడ పరిచర్య యొక్క ప్రారంభ దశలో మార్గరెట్ కేవలం తన భర్తకు సాధ్యమైన అన్ని విధాలుగా సహాయపడటమే కాకుండా, స్థానిక మహిళల పరిస్థితి మెరుగుపరచబడుటకు ఎంతో శ్రమించి పరిచర్యలో ఒక ముఖ్యమైన భాగమును కలిగియున్నారు. మహిళలకు బోధించుట కొరకు తరగతులను కూడా ఏర్పరచిన ఆమె, వారికి ఈ లోకము గురించే కాక రాబోవు నిత్యరాజ్యము గురించి కూడా బోధించారు. మార్గదర్శకులైన ఆ మిషనరీ దంపతులు వారి విశ్వాస సహనములకు పలు పరీక్షలను ఎదుర్కొన్నారు. వాటిలో అనేకం కేవలం వారి పరమందున్న యజమానికి మాత్రమే తెలుసు. ఫిజీ ప్రజలు నరమాంసభక్షకులు కావడంతో దక్షిణ పసిఫిక్ దీవులలోని మిషన్ స్టేషన్లకు సరుకులను అందించే ఓడ తోంగా ద్వీపాలు దాటి వెళ్ళుటకు నిరాకరించడంతో అనేక నెలల తరబడి జీవితము యొక్క కనీస అవసరతలను కూడా కలిగిలేని పరిస్థితులను కూడా వారు ఎదుర్కొన్నారు.

ఏదేమైనప్పటికీ పరిచర్యలో ముందుకు సాగిపోయిన ఆ మిషనరీ దంపతుల ప్రయత్నాల ద్వారా ఆశీర్వదించబడినది కేవలం లకెంబా ద్వీపం మాత్రమే కాదు. ఆ దంపతులు ద్వీపం నుండి ద్వీపానికి వెళ్తూ, వెళ్ళిన చోటెల్లా దేవుని వాక్యమనే మంచి విత్తనమును నమ్మకముగా నాటగా అనేకమంది దేవుని సత్యానికి విధేయులయ్యారు. లేమి మరియు కష్టముల యొక్క సంపూర్ణ అనుభవముల మధ్యలో ఫిజి ద్వీపసమూహములోని వివిధ ప్రాంతాలలో ఎంతగానో శ్రమించి పరిచర్య చేసిన తరువాత మార్గరెట్ యొక్క ఆరోగ్యం బాగా క్షీణించడం ప్రారంభమవ్వగా 1840వ సంll లో ఆమె పరమందు తన ప్రభువును చేరుకున్నారు.

🚸 ప్రియమైనవారలారా, సంపూర్తిగా ప్రభువుపైనే ఆనుకొనినవారై సువార్తను పంచుకొనుటకు దేవుడు చూపించిన ఏ చోటికైనా వెళ్ళుటకు మీరు సిద్ధమేనా? 🚸

🛐 "ప్రభువా, అన్యదేశాలలో దేవుని వాక్యమనే మంచి విత్తనమును నమ్మకముగా నాటుటకు నాకు సహాయము దయచేయుము. ఆమేన్!" 🛐

🙏🙏 దేవునికే మహిమ కలుగునుగాక! 🙏🙏

  • WhatsApp
  • No comments:

    Post a Comment