Search Here

Oct 1, 2021

Ashbel Green Simonton | అష్బెల్ గ్రీన్ సైమన్‌టన్

అష్బెల్ గ్రీన్ సైమన్‌టన్  | Ashbel Green Simonton



  • జననం: 20-01-1833
  • మహిమ ప్రవేశం: 09-12-1867
  • స్వస్థలం: పెన్సిల్వేనియా
  • దేశం: అమెరికా సంయుక్త రాష్ట్రాలు
  • దర్శన స్థలము: బ్రెజిల్

  అమెరికాకు చెందిన అష్బెల్ గ్రీన్ సైమన్‌టన్ బ్రెజిల్‌లో మొట్టమొదటి ప్రొటెస్టెంట్ స్సంఘమును ప్రారంభించిన ఒక మార్గదర్శక మిషనరీ. అతని తల్లి అతనిని దేవుని సేవ కొరకు సమర్పించారు. దైవిక వాతావరణంలో పెరిగిన అతను, ఉపాధ్యాయ వృత్తిని చేపట్టారు మరియు న్యాయశాస్త్ర విద్యను కూడా అభ్యసించారు. అయితే, దేవుడు అతని తల్లి యొక్క ప్రార్థనలకు సమాధానమిచ్చి, 1855వ సంll లో జరిగిన ఒక ఉజ్జీవ కూడికలో ఎంతో శక్తివంతంగా సైమన్‌టన్‌తో మాట్లాడాడు.

  దేవుని పిలుపుకు విధేయత చూపించిన సైమన్‌టన్, మంచి భవిష్యత్తు ఉన్న తన ఉపాధిని వదులుకొని బైబిలు వేదాంత శాస్త్రములో శిక్షణ కొరకు ప్రిన్స్‌టన్ సెమినరీలో చేరారు. అక్కడ ఉన్నప్పుడు అతను విదేశాలలో మిషనరీ సేవ చేయుటను గురించి డాll చార్లెస్ హోడ్జ్ ఇచ్చిన ప్రసంగము ద్వారా లోతుగా కదిలింపబడ్డారు. ప్రార్థనాపూర్వకంగా అతను ‘ప్రెస్బిటేరియన్ బోర్డ్ ఆఫ్ ఫారిన్ మిషన్స్‌’ కు తన సేవలను అందించుటకు ముందుకువచ్చారు. కాగా, ఆ సంస్థ బ్రెజిల్‌లో మిషనరీ పరిచర్య చేయుటకు అతనిని నియమించింది.

 1859వ సంll లో రియో డి జనీరోకు చేరుకొనిన సైమన్‌టన్, అక్కడ సువార్త పరిచర్యను, మరిముఖ్యంగా పిల్లల మధ్య సువార్త సేవను ప్రారంభించారు. అతను 5 మంది పిల్లలతో మొదటి ఆదివారపు బైబిలు పాఠశాలను నిర్వహించారు మరియు కేవలం ఇద్దరు విశ్వాసులతో బైబిల్ పఠన కూడికను ప్రారంభించారు. అక్కడి స్థానిక కాథలిక్కులకు విశ్వాసం ద్వారా మాత్రమే క్రీస్తులో రక్షణ అనే ఉపదేశం వారు మునుపు విననిది. పరలోకం మరియు నరకం గురించి బైబిలు ఆధారముగా ఇచ్చిన వివరణలను అనేక మంది అంగీకరించారు మరియు క్రమంగా ఆచారములతో కూడుకొనియున్న తమ క్రైస్తవ మతాన్ని విడిచిపెట్టారు. అటువంటి వారిలో ఒకరైన జోస్ మనోయెల్ అనే ఒక కాథలిక్ పాదిరి అష్బెల్ చేత బాప్తిస్మము పొంది, తదుపరి పరిచర్యలో అతని సహచరులు అయ్యారు.

 రియోలో పరిచర్య జరిగించడమే కాకుండా తీరప్రాంత నగరాలను పర్యటించి క్రైస్తవ సంఘములను మరియు సెమినరీలను (బైబిలు వేదాంత కళాశాలలు) స్థాపించారు సైమన్‌టన్. స్థానికుల ఆత్మలను గెలుచుకొనుటకు అతను ప్రధానంగా గ్రామీణ ప్రాంతాలపై దృష్టి కేంద్రీకరించారు, మరియు స్థానిక సంఘమును వారే నడిపించుకొనగలుగునట్లు వారికి తగిన శిక్షణ ఇచ్చేవారు. ఇది ఒక బలమైన జాతీయ పాదిరుల సమూహము యొక్క ఆవిర్భావమునకు దారితీసింది.

  “కేవలం మనుష్యపరమైన ఒక సంస్థ ద్వారా జరిగించవలెనంటే ఈ పని ఎంతో నిరాశాజనకంగా ఉంటుంది. అయితే, దానిని చేపట్టే వారు దేవుని శక్తిపై ఆధారపడాలి, లేకపోతే చివరికి నిరాశే ఫలితంగా పొందాలి.” అనునవి బ్రెజిల్‌లో అడుగుపెట్టినప్పుడు అష్బెల్ చెప్పిన మాటలు. సర్వశక్తిమంతుని యొక్క సార్వభౌమ శక్తిపైనే పూర్తిగా ఆధారపడిన సైమన్‌టన్, బ్రెజిల్‌లో కేవలం ఏడు సంవత్సరాల తన పరిచర్యలో అతను ఎంతో సాధించారు. 1867వ సంll లో ప్రాణాంతకమైన యెల్లో ఫీవర్ అనే జ్వరం బారిన పడి 
34 సంll ల లేత వయస్సులోనే దేవుని పరమసన్నిధిని చేరుకున్నారు అష్బెల్ గ్రీన్ సైమన్‌టన్.

ప్రియమైనవారలారా, పరిచర్య చేస్తున్నప్పుడు మీరు దేవుని శక్తిపై ఆధారపడుతున్నారా?

ప్రభువా, మీ శక్తితో నన్ను నింపుము. ఆలయక పరుగెత్తుటకును సొమ్మసిల్లక ముందుకు సాగిపోవుటకును నాకు సహాయము దయచేయుము. ఆమేన్!

దేవునికే మహిమ కలుగునుగాక!

  • WhatsApp
  • No comments:

    Post a Comment