Search Here

Jul 26, 2022

Iris Paul | ఐరిస్ పాల్

ఐరిస్ పాల్   గారి జీవిత చరిత్ర



  • జననం: 1945
  • స్వస్థలం: తమిళనాడు
  • దేశం: భారతదేశం
  • దర్శన స్థలము: ఒరిస్సా, భారతదేశం


ఐరిస్ గ్రేస్ రాజకుమారి పాల్ ఒక భారతీయ మిషనరీ. ఆమె ‘రీచింగ్ హ్యాండ్ సొసైటీ’ క్రింద ఒరిస్సాలోని బోండో తెగల మధ్య పరిచర్య చేయుటకు సమర్పణ కలిగియున్నవారు. ఒక సంపన్న క్రైస్తవ కుటుంబములో జన్మించిన ఐరిస్, తిరుగుబాటు ధోరణి మరియు తల బిరుసుతనం కలిగిన బాలికగా ఉండేవారు. అయితే, తన తల్లిదండ్రుల యొక్క భక్తి  శ్రద్ధలు కలిగిన జీవితము ద్వారా ఎంతగానో ప్రభావితులైన ఆమె, చివరికి తన హృదయమును యేసు క్రీస్తు ప్రభునకు సమర్పించారు. కళాశాలలో చదువుకుంటున్న రోజులలో ఆమె ‘యూనియన్ ఆఫ్ ఇవాంజెలికల్ స్టూడెంట్స్ ఆఫ్ ఇండియా’ (యు.ఇ.ఎస్.ఐ.) యొక్క పరిచర్యలో చురుకుగా పాల్గొన్నారు. పిమ్మట ఆమె తమిళనాడులో తన వైద్యశాస్త్ర విద్యాభ్యాసమును బంగారు పతకంతో ముగించారు.


ఆల్బర్ట్ ష్వీట్జెర్ అనే మిషనరీ ఆఫ్రికాలో జరిగించిన మిషనరీ పరిచర్య ద్వారా ప్రేరణ పొందిన ఐరిస్, తాను కూడా దేవుని సేవ చేయుటకు అక్కడికి వెళ్ళాలని కోరుకున్నారు. అయితే, తన స్వదేశంలోనే ఆమెను వాడుకొనుటకు దేవుడు ఆమె పట్ల భిన్నమైన ప్రణాళికలను కలిగియున్నాడు. 1972వ సంll లో ఒరిస్సాలోని బోండో తెగల మధ్య పనిచేస్తున్న డాll ఆర్.ఎ.సి. పాల్ అనే యువ మిషనరీతో ఐరిస్ యొక్క వివాహం జరిగింది. అప్పటిలో బోండో తెగలవారితో బయటివారు అంతగా సంబంధాలు ఏర్పరచుకోలేదు. ఒక విధంగా వారు బయటి ప్రపంచమునకు మరుగైనవారుగా ఉన్నారని చెప్పవచ్చు. దారిద్య్రముతో నిండియున్న నిరక్షరాస్యులైన ఆ ప్రజలలో మరణాల రేటు అధికముగా ఉండేది. అటువంటి పరిస్థితులలో తన భర్తతో కలిసి ఒరిస్సాలోని మల్కన్‌గిరికి వెళ్ళిన ఐరిస్, వెనువెంటనే గిరిజన ప్రజలకు చికిత్స చేయుట కొరకు ఒక చిన్న వైద్యశాలను ప్రారంభించారు. అంతేకాకుండా ఆమె తన భర్తతో కలిసి వైద్య శిబిరాలను కూడా నిర్వహించారు. అదే సమయంలో ఆమె గిరిజనులకు సువార్తను కూడా తెలియపరిచేవారు. క్రమక్రమంగా యేసుక్రీస్తులో సత్యమును కనుగొన్న వేలాది మంది బోండో ప్రజలు, ఆయనను తమ రక్షకునిగా అంగీకరించారు.


ప్రారంభ సంవత్సరాలలో అనారోగ్యం, ప్రమాదాలు, నిరాశాజనకమైన పరిస్థితులు, తీవ్రముగా కృంగిపోయిన సందర్భములు మరియు ఎంతో బాధను అనుభవించినప్పటికీ, ప్రభువు మీదనే వారి దృష్టిని నిలిపిన ఆ మిషనరీ దంపతులు, నాగటి మీద నుండి వారి చేతులను ఎన్నడూ వెనుకకు తీయలేదు. 1986వ సంll లో ఆమె భర్త చిన్న వయస్సులోనే మరణించినప్పటికీ, ఆమె ఒరిస్సాలోని మారుమూల గ్రామాలలో తన సేవను కొనసాగించారు. ఆమె అనేక మంది అనాథ పిల్లలకు తల్లిగాను మరియు అక్రమమునకు గురికాకుండా అనేక మంది యువతులను కాపాడినవారిగాను ఉన్నారు. అంతేకాకుండా, ప్రజలను క్రీస్తు వద్దకు నడిపించుటకును మరియు గిరిజన ప్రజలకు సమగ్ర అభివృద్ధిని చేకూర్చుటకును పనిచేసే ‘రీచింగ్ హ్యాండ్ సొసైటీ’ అనే సంస్థను కూడా ఆమె స్థాపించారు. గిరిజనుల జీవితములలో భౌతికపరమైన మరియు ఆత్మీయపరమైన మార్పును తెచ్చుటకు తన కుమారుడైన రెమో పాల్ మరియు అతని భార్య డాll సూసన్ రెమో పాల్‌లతో కలిసి ఎంతగానో కృషి చేస్తున్న ఐరిస్ పాల్, ఈ నాటికీ దేవుని సేవలో ముందుకు సాగిపోతున్నారు. 


ఈ జీవిత చరిత్ర ద్వారా మనం ఆలోచించాల్సినది : 

ప్రియమైనవారలారా, మీ సమస్యలు మరియు కష్టతరమైన పరిస్థితుల కంటే గొప్పవాడైన ప్రభువుపై మీ కనుదృష్టిని నిలుపుతున్నారా? 


ప్రార్థన :

"దేవా నా ప్రభువా, నా కన్నులు నీతట్టు చూచుచున్నవి. నేను నీ శరణుజొచ్చియున్నాను. ఆమేన్!"  

దేవునికే మహిమ కలుగునుగాక! హల్లెలూయా !


  • WhatsApp
  • No comments:

    Post a Comment