Search Here

Dec 20, 2021

Martha Mault Life History

మార్తా మాల్ట్ గారి జీవిత చరిత్ర





  • జననం: 1794
  • మహిమ ప్రవేశం: 1870
  • స్వస్థలం: హంటింగ్‌డాన్‌షైర్
  • దేశం: ఇంగ్లాండు
  • దర్శన స్థలము: దక్షిణ భారతదేశం

 పులప్పేడి అనేది పూర్వపు కాలంలో కేరళలో ఉన్న ఒక దురాచారం. అదేమంటే తక్కువ కులానికి చెందిన పురుషులు ఉన్నత కులానికి చెందిన ఎవరైనా స్త్రీని చూసినట్లయితే ఆ స్త్రీని సమాజం బహిష్కరిస్తుంది. ఏలయనగా ఆ కులానికి చెందినవారు ఆమెను అపవిత్రురాలిగా పరిగణిస్తారు. కాగా ఆమె అమ్మబడాలి లేదా శిక్షనుండి ఎటువంటి మినహాయింపు లేకుండా తన స్వంత కుటుంబం ద్వారా చంపబడాలి. దాదాపుగా అటువంటి స్త్రీలందరూ బిచ్చగత్తెలుగా లేదా బానిసలుగా మారారు. అటువంటి స్త్రీలకు మార్తా మాల్ట్ తల్లి అయ్యారు.

 మార్తా మాల్ట్ ఒక ఆంగ్లేయ మిషనరీ. నేడు ఆమె ‘ది మదర్ ఆఫ్ ఫిమేల్ ఎడ్యుకేషన్ అండ్ లిబరేషన్ ఇన్ సౌత్ ఇండియా’ గా (దక్షిణ భారతదేశ మహిళా విద్యాభ్యాస మరియు విడుదల యొక్క తల్లి) పేర్కొనబడతారు. 24 ఏళ్ల వయస్సులో ఆమె భారతదేశంలో పరిచర్య చేయుటకు లండన్ మిషనరీ సొసైటీచే నియమించబడిన చార్లెస్ మాల్ట్‌ను వివాహం చేసుకున్నారు. వివాహం జరిగిన ఒక వారంలోగానే ఈ నవ దంపతులు ఐదు నెలల సుదీర్ఘ సముద్రయానమును చేపట్టి 1818వ సంll లో భారతదేశానికి వచ్చారు.

 స్థానిక భాషను నేర్చుకొనుటలో కొంత సమయం గడిపిన తరువాత చివరికి వారు తమిళనాడు రాష్ట్రంలో ఉన్న కన్యాకుమారి జిల్లాలోని నాగర్‌కోయిల్‌ అనే ఊరిలో పరిచర్య చేయడం ప్రారంభించారు. మార్తా గొప్ప సహనం మరియు మిషనరీకి ఉండే గొప్ప గుణంతో భారతీయ ఉష్ణమండల వాతావరణము యొక్క మిక్కుటమైన వేడికి తనను తాను అలవరచుకున్నారు. బహిష్కరించబడిన మహిళలు కలిగియుంటున్న దుర్భర జీవితాలను చూచి ఆమె ఎంతగానో చలించిపోయారు. కాగా వెంటనే ఆమె తన భర్తతో కలిసి బహిష్కరించబడిన ఈ మహిళలకు విద్య, శిక్షణ మరియు ప్రోత్సాహమును అందించే ఒక గొప్ప పనిని చేపట్టారు.

 1820వ సంll లో ఆమె బహిష్కరించబడిన బాలికలకు చదవడం మరియు వ్రాయడమును నేర్పించుటకుగాను దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి బాలికల బోర్డింగ్ పాఠశాలను స్థాపించారు. ఆర్థిక అవసరతల కొరకు వారు తమ కాళ్ళపైనే నిలబడగలుగునట్లును మరియు వారు కూడా గౌరవించబడగలుగునట్లును చేయుటకు వారికి లేస్ తయారీలో కూడా శిక్షణ ఇవ్వబడింది. ఆ విధంగా వారు సంపాదించిన ధనం వారిని బానిసత్వం నుండి విడిపించి స్వతంత్రులుగా చేయుటకు వినియోగించబడింది. తరువాతి 35 సంవత్సరాల తన పరిచర్యలో ఆమె బాలికల కొరకు మరి 26 గ్రామ పాఠశాలలను స్థాపించగలిగారు. ఆ విధంగా ఆ ప్రాంతంలో ఒక ప్రధాన పరిశ్రమగా మారిన లేస్ తయారీ, నేటికీ అక్కడ కొనసాగుతోంది. అంతేకాదు, కరపత్రాలను పంచిపెట్టుటకును మరియు సువార్త ప్రకటించుటకును ఆమె తన విద్యార్థులకు శిక్షణనిచ్చారు. అది కేరళ అంతర్భాగాలకు క్రైస్తవ మతం వ్యాప్తి చెందుటకు దారితీసింది. 

 మాదిరిగా నిలిచే 35 సంవత్సరాల శ్రేష్ఠమైన పరిచర్య తరువాత 1853వ సంll లో ఆమె ఇంగ్లాండుకు తిరిగివెళ్ళారు. అక్కడ తన తుది శ్వాస వరకు కూడా పరిచర్య కొరకు ఇతరులను ప్రోత్సహించడం కొనసాగించిన మార్తా మాల్ట్, 1870వ సంll లో మహిమలోకి పిలువబడ్డారు.

ప్రియమైనవారలారా, సమాజం యొక్క అభివృద్ధి కొరకు ఒక క్రైస్తవునిగా మీరు అందిస్తున్న సహకారం ఏమిటి?

"ప్రభువా, నిజమైన క్రైస్తవ జీవితమును కలిగియుండి సమాజంలో మార్పు తీసుకువచ్చుటకు నాకు సహాయము దయచేయుము. ఆమేన్!

దేవునికే మహిమ కలుగునుగాక!
  • WhatsApp
  • No comments:

    Post a Comment