Search Here

Showing posts with label S. Show all posts
Showing posts with label S. Show all posts

May 14, 2023

Samuel Kaboo Morris | శామ్యూల్ కబూ మోరిస్

శామ్యూల్ కబూ మోరిస్ గారి జీవిత చరిత్ర

  • జననం : 1872
  • మహిమ ప్రవేశం : 12-05-1893
  • స్వస్థలం : ఆఫ్రికా
  • దర్శన స్థలము : అమెరికా

శామ్యూల్ కబూ మోరిస్ (ప్రిన్స్ కబూ/కబూ యువరాజు) ఆఫ్రికాలోని లైబీరియాలో ఉన్న క్రూ అనే తెగ యొక్క నాయకుని కుమారుడు. అతను బాలునిగా ఉన్నప్పుడు గ్రీబో తెగవారు అతనిని బంధించి, క్రూ తెగ నుండి కప్పం వసూలు చేయుటకై అతనిని ఒక పాచికగా వాడుకున్నారు. కప్పం చెల్లించుటలో క్రూ తెగ ఎప్పుడైనా విఫలమయినట్లయితే గ్రీబో తెగవారు కబూ శరీరమునకు తేనె పూసి సజీవముగా అతనిని తిని వేయుటకు చీమల మధ్య అతనిని వదిలివేసేవారు. మరణపుటంచులలో నిస్సహాయమైన స్థితిలో ఉన్న కబూ, ఆ చిత్రహింసల వలన నిరాశ నిస్పృహలలోకి వెళ్ళిపోయారు. ఒక రాత్రి అతను కొరడాతో కొట్టబడబోతున్నప్పుడు, అకస్మాత్తుగా అక్కడ కళ్ళు బైర్లు కమ్మేటంత గొప్ప వెలుగు మెరుపులా మెరిసింది. అంతలో అతను "కబూ, పారిపో!" అనే శబ్దమును వినడం జరిగింది. వెంటనే అతను అడవిలోనికి పరుగెత్తారు. ఆపై దివారాత్రుళ్ళు ప్రయాణించి మన్రోవియా చేరుకున్నారు.


మన్రోవియాలో కొన్ని సంవత్సరాల పాటు గృహాలకు రంగులు వేస్తూ తన జీవనోపాధిని పొందారు కబూ. ఒక రోజు అతను స్థానికముగా ఉన్న క్రైస్తవ సంఘమునకు వెళ్ళగా, అక్కడ ఒక మిషనరీ కళ్ళు బైర్లు కమ్మేటంత ఒక ప్రకాశవంతమైన వెలుగు ద్వారా సౌలు ఏవిధముగా మారుమనస్సు పొందారో చెబుతుండగా విన్నారు. తన స్వంత జీవితగాథకు ఆ లేఖన భాగముతో ఉన్న సారూప్యతను చూచి ఆశ్చర్యపోయిన కబూ, “నేను ఆ వెలుగును చూశాను!” అని అరిచారు. తదుపరి అతను యేసు క్రీస్తును తన స్వంత రక్షకునిగా అంగీకరించి  బాప్తిస్మము పొందగా అతనికి శామ్యూల్ మోరిస్ అనే క్రైస్తవ నామం ఇవ్వబడింది. అప్పటి నుండి అతను క్రీస్తును గురించి మరి అధికముగా తెలుసుకొనవలెననే వాంఛను కనుబరిచారు. కాగా ఒక మిషనరీ సూచన మేరకు అమెరికాకు పయనమైన అతను, 18సంll ల వయస్సులో న్యూయార్క్ నగరమునకు చేరుకున్నారు. అక్కడ స్టీఫెన్ మెరిట్ అనే వ్యక్తి సహాయంతో అతను ఇండియానాలోని టేలర్ విశ్వవిద్యాలయంలో చేరారు. సాధారణమైనదిగా ఉండే అతని శ్రేష్టమైన విశ్వాసం మరియు అతని యొక్క అద్భుత గాథ కళాశాలలోను మరియు ఆ చుట్టుప్రక్కల ఉండే జనసమూహములలోను ఉజ్జీవమును తీసుకువచ్చాయి.


మోరిస్ ముఖ్యముగా తన ప్రార్థన జీవితమును బట్టి పేరొందారు. రాత్రి సమయములో అతను తన గదిలో ప్రార్థించుచుండుటను వినవచ్చు. దానిని అతను ఎంతో సాధారణముగా ‘నా తండ్రితో మాట్లాడుతున్నాను’ అని పేర్కొనేవారు. ఇతరులకు సాక్ష్యమిచ్చుటకు కలిగిన ప్రతి అవకాశమును అతను వినియోగించుకున్నారు. అయితే సువార్తను తన స్వజనుల యొద్దకు తీసుకువెళ్ళవలెనని అతని హృదయం  ఎంతగానో వాంఛించింది. ఏదేమైనప్పటికీ కేవలం 21 ఏళ్ళ యవ్వన ప్రాయంలో తీవ్రమైన జలుబు బారినపడిన అతను, లేత వయస్సులోనే తన పరమ వాసస్థలమునకు చేరుకున్నారు. అతని అకాల మరణం అతని తరపున ఆఫ్రికాకు మిషనరీలుగా వెళ్ళి సేవ చేయుటకు అతని తోటి విద్యార్థులను ప్రేరేపించింది. తద్వారా ఏదో ఒక రోజు తన స్వజనులకు సేవ చేయుటకు తన స్వస్థలమునకు తిరిగి వెళ్ళవలెనన్న శామ్యూల్ మోరిస్ యొక్క కల నెరవేరింది.

ఈ జీవిత చరిత్ర ద్వారా మనం ఆలోచించాల్సినది : 

ప్రియమైనవారలారా, మీ పరలోకపు తండ్రితో మీరు ఎంత తరచుగా మాట్లాడుతున్నారు?

ప్రార్థన :

"ప్రభువా, మరింత తరచుగా మీతో సంభాషించుటకును, మీతో నేను కలిగియున్న వ్యక్తిగత సహవాసములో మరింతగా బలపరచబడి అభివృద్ధి చెందుటకును నాకు సహాయము దయచేయుము. ఆమేన్!"

దేవునికే మహిమ కలుగునుగాక! హల్లెలూయా !


  • WhatsApp
  • Saint Cyprian | సెయింట్ సైప్రియన్

    సెయింట్ సైప్రియన్ గారి జీవిత చరిత్ర


    • జననం : ~ 200-210
    • మరణం : 14-09-258
    • స్వస్థలం : కార్తేజ్, రోమా సామ్రాజ్యం
    • దర్శన స్థలము : కార్తేజ్, రోమా సామ్రాజ్యం


    సైప్రియన్ లేదా థాస్సియస్ సిసిలియానస్ సైప్రియానస్ అప్పటిలో రోమా సామ్రాజ్యం క్రింద ఉన్న ఆఫ్రికా ప్రాంతంలో ఒక సంపన్న కుటుంబములో జన్మించారు. వారు అన్యజనులు. కార్తేజ్‌లోని న్యాయవృత్తికి సంబంధించిన వారిలో మంచి మేథస్సు కలిగినవానిగా ఉన్న అతను, ఉపాధ్యాయునిగా మరియు నిర్వాహకునిగా గౌరవప్రదమైన పదవిని కలిగియున్నారు. అయినప్పటికీ, అతను తన యవ్వన జీవితమును వ్యర్థపరచి హృదయ శాంతి కొరకు ఎంతో పరితపించారు. కాగా తనకు సహాయము చేయుమని అతను ఒక పాదిరిని కోరగా, ఆ పాదిరి అతనిని క్రీస్తు నొద్దకు నడిపించి, తద్వారా రక్షణ మార్గములోనికి నడిపించారు. బాప్తిస్మము పొందిన తరువాత అతను తన ఆస్తి అంతటినీ అమ్మి బీదలకు పంచిపెట్టి, పవిత్ర జీవితము జీవించుటకు ఎంచుకున్నారు.


    అపారమైన లేఖన జ్ఞానం మరియు అద్భుతమైన వక్తృత్వ నైపుణ్యాలను కలిగియున్న సైప్రియన్, మారుమనస్సు పొందిన రెండేళ్ళ వ్యవధిలోనే పాదిరిగా నియమించబడ్డారు. తదుపరి అతను కార్తేజ్ సంఘమునకు బిషప్పు‌గా అభిషేకం చేయబడ్డారు. ఆ సంఘములో మంచి పేరుపొందిన అతను, పేదల యొక్క అభిమానమును చూరగొన్నారు. అది అక్కడి సమాజము యొక్క ఆత్మీయ అభివృద్ధికి దారితీసింది. క్రైస్తవ సంఘములోను, వివిధ క్రైస్తవ సంఘముల మధ్యను, అదేవిధముగా బిషప్పుల మధ్యను ఐక్యత ఉండవలెనని అతను బలముగా విశ్వసించేవారు. అతను వివిధ సంఘముల దిద్దుబాటు, ఆత్మీయ అభివృద్ధి మరియు ఏకీకరణ కొరకు క్రైస్తవ సంఘము యొక్క రాజ్యాంగ సిద్ధాంతమును అభివృద్ధి చేశారు.


    డెసియస్ చక్రవర్తి పాలనలో క్రైస్తవులకు గొప్ప హింస కలుగగా, సైప్రియన్ హతసాక్షిగా మరణించే ఆ మహిమకరమైన భాగ్యమును ఎంచుకొనక, దాగుకొని, తన మందను రహస్యముగా నడిపించుటకు ఎంచుకున్నారు. అయితే, వలేరియన్ చక్రవర్తి పాలనలో మరలా క్రైస్తవులకు హింస కలుగినప్పుడు, అన్యదేవతలకు బలి ఇచ్చుటకు సైప్రియన్ బలవంతపెట్టబడ్డారు. అందుకు అతను నిరాకరించి క్రీస్తు మాత్రమే రక్షకుడని దృఢముగా తెలియపరచినందువలన అతను కురుబిస్‌ పట్టణముకు బహిష్కరించబడ్డారు. అక్కడ నుండి లేఖల ద్వారా విశ్వాసులకు ఆదరణ కలిగించుటకు తన సామర్థ్యం మేరకు అతను ప్రయత్నించారు. శ్రమలలో ఐక్యతను, నిరీక్షణను మరియు దీర్ఘశాంతమును కలిగియుండవలెనని అతను సంఘమును వేడుకున్నారు.


    రోమా దేవతలకు బలి ఇచ్చి విడుదల పొందుటకు అతనికి ఇవ్వబడిన మరొక అవకాశమును కూడా అతను తిరస్కరించగా, అతనిని శిరచ్ఛేదనం చేయవలెలని ఆజ్ఞాపించబడింది. ఎంతో ప్రశాంతతతో ప్రార్థన చేయుటకు సైప్రియన్ మోకరిల్లినప్పుడు, ఖడ్గము అతని తలను ఛేదించింది.

    ఈ జీవిత చరిత్ర ద్వారా మనం ఆలోచించాల్సినది : 

    ప్రియమైనవారలారా, కష్ట సమయములలో క్రీస్తునందున్న మీ సహోదరసహోదరీలను మీరు ఆదరించుచున్నారా? 

    ప్రార్థన :

    "ప్రభువా, కష్ట సమయములలో నిరీక్షణ కలిగియుండుటకును మరియు క్రీస్తునందు సహోదరసహోదరీలను ఆదరించుటకు యోగ్యమైన పాత్రగా ఉండుటకును నాకు సహాయము చేయుము. ఆమేన్!"

    దేవునికే మహిమ కలుగునుగాక! హల్లెలూయా !


  • WhatsApp
  • May 13, 2023

    Samuel S. Day | శామ్యూల్ ఎస్. డే

    శామ్యూల్ ఎస్. డే గారి జీవిత చరిత్ర

    Pictures shown are for illustration purpose only



    • జననం : 13-03-1808
    • మరణం : 17-09-1871
    • స్వస్థలం : బాస్టర్డ్ టౌన్‌షిప్, ఓంటారియో
    • దేశం  : కెనడా
    • దర్శన స్థలము : తెలుగు ప్రాంతం, భారతదేశం


    "తెలుగు మిషన్" వ్యవస్థాపకుడైన శామ్యూల్ స్టెర్న్స్ డే అమెరికాకు చెందిన ఒక బాప్తిస్టు మిషనరీ. అతను తెలుగు మాట్లాడే ప్రజలకు వెలుగు తీసుకురావలెనని ఎంతో భారం కలిగి ఉన్నవారు. కాగా తన భార్యయైన రొయెన్నాతో కలిసి భారతదేశానికి వచ్చిన అతను, 1836వ సంll లో విశాఖపట్నంలో మిషనరీగా సేవను ప్రారంభించారు. తరువాత శ్రీకాకుళంకు వెళ్ళిన అతను, మరుసటి ఏడాది నాటికి మద్రాసుకు వెళ్ళారు. మద్రాసులో సేవ చేస్తున్న రోజులలో అక్కడి నుండి తెలుగువారి ప్రాంతానికి అనేక మార్లు పర్యటించారు శామ్యూల్. కాగా ఒక కోటికి పైగా ప్రజలు నివసిస్తున్న మద్రాసు మరియు విశాఖపట్నాలకు మధ్య ఉన్న ప్రాంతములో ఒక్క మిషనరీ కూడా లేరని గ్రహించిన అతని హృదయం ఎంతో భారముతో నిండిపోయింది. తత్ఫలితముగా 1840వ సంll లో అతను తెలుగువారి ప్రాంతమైన నెల్లూరుకు వచ్చి, అక్కడ “తెలుగు మిషన్” ను స్థాపించారు. నెల్లూరు ప్రాంతంలో సువార్తను ప్రకటించిన అతను, 1844వ సంll నాటికి కొద్దిమంది విశ్వాసులతో అక్కడ ఒక క్రెస్తవ సంఘమును ప్రారంభించారు. అప్పుడు ఉన్న తెలుగు బైబిలు యొక్క అనువాదాలను మెరుగుపరచడంలో కూడా అతను సహాయమందించారు. ఆ దంపతులిరువురూ కలిసి బాలురు మరియు బాలికల కొరకు పాఠశాలలను కూడా స్థాపించారు. అప్పుడే వికసిస్తున్న మొగ్గగా ఉన్న ఆ పరిచర్య అతి త్వరలోనే అడ్డంకులను ఎదుర్కొంది. ఏలయనగా 1846వ సంll లో అనారోగ్యం కారణంగా ఆ మిషనరీ దంపతులు వారి స్వదేశానికి తిరిగి వెళ్ళవలసి వచ్చింది.


    వారు అమెరికాలో ఉన్నప్పుడు, 'మిషనరీ యూనియన్' 'తెలుగు మిషన్' ‌ను వదలివేద్దామా అనే ప్రశ్నను లేవనెత్తింది. అయితే దేవుడు నమ్మకమైనవాడు. ఆ మిషన్ కొనసాగించబడులాగున ఆయన లైమాన్ జ్యూవెట్‌ను లేవనెత్తాడు. తద్వారా 1849వ సంll లో జ్యూవెట్ దంపతులతో కలిసి శామ్యూల్ డే తిరిగి భారతదేశానికి రాగా, నెల్లూరు మిషన్ వద్ద పరిచర్య తిరిగి జీవం పోసుకుంది. ఆ మిషనరీలు అనేక  పాఠశాలలను ప్రారంభించారు, విస్తృతమైన సువార్త సేవ చేశారు. శామ్యూల్ డే ఒక కష్టతరమైన ప్రయాణాన్ని చేపట్టి, పశ్చిమ దిక్కుగా ఉదయగిరి వరకు ప్రయాణించి ఆ మార్గములోని ప్రాంతాలలో సువార్తను ప్రకటిస్తూ వెళ్ళారు. అయితే, క్రైస్తవులుగా మారిన వారి సంఖ్య అంత గణనీయంగా లేని కారణంగా, 1853వ సంll మిషనరీ యూనియన్‌లో  'తెలుగు మిషన్' ‌ను వదలివేద్దామా అనునది మళ్ళీ చర్చనీయాంశమయ్యింది. కానీ, విస్తారమైన ఆ ప్రాంతంలో ఉన్న ఏకైక మిషన్ ఇది మాత్రమే. ఆ సత్యాన్ని ఎత్తి చూపుతూ  'తెలుగు మిషన్' ‌ను ఒక 'ఒంటరి నక్షత్రం' గా వర్ణిస్తూ ఎస్. ఎఫ్. స్మిత్ వ్రాసిన "ది లోన్ స్టార్" అనే కవిత మిషనరీ యూనియన్‌లోని సభ్యుల హృదయాలను కదిలించింది. తత్ఫలితముగా జ్యూవెట్ ద్వారా ఆ మిషన్ కొనసాగించబడుటకు ఆమోదించబడింది. ఆరోగ్యం క్షీణించడం వలన శామ్యూల్ డే 1853వ సంll లో తిరిగి అమెరికాకు వెళ్ళినప్పటికీ, భారతదేశంలోని మిషనరీ సేవల కొరకు నిధులను సేకరించుటకు అతను అమెరికాలో వివిధ ప్రాంతాలకు విస్తృతంగా ప్రయాణించారు.

    ఈ జీవిత చరిత్ర ద్వారా మనం ఆలోచించాల్సినది : 

    ప్రియమైనవారలారా, వెలుగు లేని ప్రదేశములో మీరు ఒక “ఒంటరి నక్షత్రం” గా ప్రకాశించెదరా?

    ప్రార్థన :

    "ప్రభువా, ఇంకా అంధకారంలోనే మగ్గిపోతున్న ఆత్మల గురించిన భారం నాలో కలిగించి, వారికి వెలుగును తెచ్చుటకు నేను ప్రకాశించునట్లు సహాయము చేయుము. ఆమేన్!"

    దేవునికే మహిమ కలుగునుగాక! హల్లెలూయా !


  • WhatsApp
  • Apr 7, 2022

    Saint Polycarp | సెయింట్ పాలికార్ప్

    సెయింట్ పాలికార్ప్ జీవిత చరిత్ర





    • జననం : ~ క్రీ.శ. 65
    • మరణం : ~ క్రీ.శ. 155
    • స్వస్థలం : స్ముర్న (ప్రస్తుత ఇజ్మీర్, టర్కీ) 
    • దర్శన స్థలము : స్ముర్న


    అపొస్తలుల పాదముల వద్ద కూర్చుని,  ఈ లోకములో యేసు క్రీస్తు జీవించినప్పటి విషయములను వారి నోటి నుండే వినడం ఎంత గొప్ప ధన్యత! పాలికార్ప్ తన యవ్వనంలో అటువంటి అనుభవాన్నే కలిగియున్నారు. అతను మొదటి శతాబ్దంలో యేసు క్రీస్తు యొక్క ఆది అపొస్తలుల ద్వారా సువార్త ప్రకటింపబడిన కుటుంబములో జన్మించారు. అంతియొకయకు చెందిన ఇగ్నేషియస్‌తో పాటు అతను కూడా అపొస్తలుడైన యోహాను యొక్క శిష్యునిగా ఉన్నారని చెప్పబడుతుంది. అటు పిమ్మట అతను స్ముర్న సంఘమునకు బిషప్పు‌గా ఆది అపొస్తలుల ద్వారానే నియమించబడ్డారు.


    అపొస్తలులకు ఉన్నటువంటి ఆసక్తితోనే ఒక బిషప్పుగా తనకు అప్పగింపబడిన మందను కూడా అతను ఎంతో నమ్మకముగా నడిపించారు. ఆసియా మైనర్‌లో ఉన్న క్రైస్తవులందరికీ అతను ఒక బలమైన కోటగా మారారు. క్రైస్తవ్యాన్ని వ్యతిరేకించే ప్రభుత్వం క్రింద, అన్యజనుల మధ్య సేవ చేయుటకు ఎంతో ధైర్యం మరియు దేవుని నుండి శక్తితో నింపబడాలి. వాటిని దేవుని మీదనే ఆధారపడి విశ్వాసముతో దేవుని యొద్ద నుండి పొందుకున్నారు పాలికార్ప్. ఆది అపొస్తలుల కాలం ముగిసినప్పుడు అనేక అబద్ధ బోధకులు పుట్టుకువచ్చారు. అంతేకాకుండా సంఘ క్రమమును గూర్చిన వివాదాలు చెలరేగాయి. వాటన్నింటి మధ్యలో ఒకే ఒక్క సమాధానం మాత్రమే పాలికార్ప్ వద్ద ఉంది. అదేమంటే "క్రీస్తును పోలి నడుచుకొనుట". అతను వివిధ అబద్ధ బోధకుల సమూహాలను ఎదిరించి, దేవుని మందను తప్పుడు బోధల నుండి కాపాడుటకు ఎంతో శ్రమించారు. పాలికార్ప్ వ్రాసిన అనేక పత్రికలలో ఫిలిప్పీయులకు వ్రాసిన పత్రిక భద్రపరచబడింది. ఆ పత్రికలో అతను సహనం మరియు నిరీక్షణలతో స్థిరులుగా ఉండవలెనని విశ్వాసులకు సూచించారు. 


    రోమా రాజ్య చక్రవర్తిగా మార్కస్ అరేలియస్ సింహాసనాన్ని అధిరోహించినప్పుడు, క్రైస్తవులను హింసించుటకు అతను ఉత్తర్వులు జారీ చేశాడు. కాగా రోమా అధికారులు పాలికార్ప్‌ను బంధించి, తన విశ్వాసాన్ని త్యజించి ప్రాణాలను కాపాడుకొనుమని అతనిని కోరారు. అయితే విశ్వాసంలో స్థిరముగా నిలబడిన పాలికార్ప్, "ఎనభై ఆరు సంవత్సరాలు నేను ఆయనకు సేవ చేశాను. ఏనాడూ ఆయన నాకు కీడు చేయలేదు... అలాంటప్పుడు నా రాజు మరియు రక్షకుడైన ఆయనను నేను ఎలా దూషించగలను?" అని సమాధానమిచ్చారు. ఆ విధంగా పాలికార్ప్ తన విశ్వాసాన్ని విడిచిపెట్టక బహిరంగముగా తెలియపరచగా, అది అతని మరణానికి దారితీసింది. రోమా చక్రవర్తికి ధూపం వేయనందుకుగాను అతనిని స్తంభమునకు కట్టి కాల్చివేయగా, రాజులకు రాజైన తన పరలోక దేవునికి ఇంపైన సువాసనతో కూడిన ధూపముగా మారారు పాలికార్ప్.


    ఈ జీవిత చరిత్ర ద్వారా మనం ఆలోచించాల్సినది : 

    ప్రియమైనవారలారా, క్రైస్తవులని మిమ్ములను అణచివేయుటకు ప్రయత్నించే ఎటువంటి చర్యనైనా తట్టుకొని, క్రీస్తును ప్రకటించే ధైర్యమును మీరు కలిగియున్నారా? 


    ప్రార్థన :

    "ప్రభువా, నేను స్థిరముగా నిలబడి, నా విశ్వాసమునకు సాక్షిగా ఉండుటకు నాకు సహాయము చేయుము. ఆమేన్!"

    దేవునికే మహిమ కలుగునుగాక!


  • WhatsApp
  • Sarah Lanman Smith | శారా లాన్మాన్ స్మిత్

    శారా లాన్మాన్ స్మిత్ జీవిత చరిత్ర






    • జననం : 18-06-1802
    • మరణం : 30-09-1836
    • స్వస్థలం : కనెక్టికట్
    • దేశం       : అమెరికా
    • దర్శన స్థలము : అమెరికా, సిరియా


    శారా లాన్మాన్ హంటింగ్టన్ 1802వ సంll లో కనెక్టికట్‌లోని నార్విచ్‌లో జాబెజ్ హంటింగ్టన్ మరియు మేరీ లాన్‌మన్‌ అనే దంపతులకు జన్మించారు. 12 సంll ల చిన్న వయస్సులోనే ఆమె దైవిక విషయముల వైపు ఆకర్షించబడ్డారు. హ్యారియెట్ న్యూవెల్ మరియు ఆన్ జడ్సన్ యొక్క సాక్ష్యాలు యుక్త వయస్సులో ఉన్న ఆమె పై ఎంతో ప్రభావాన్ని చూపాయి. 18 సంll ల వయస్సులో ఒక రోజు ఆమె ఒక సంఘ కూడికకు హాజరవ్వగా, ఒక క్రైస్తవురాలినని చెప్పుకుంటున్నప్పటికీ తాను కూడా ఒక పాపియేనని ఆ కూడికలో ఆమె గ్రహించారు. కాగా ఆ రోజు ఆమె తన హృదయాన్ని దేవునికి సమర్పించుకున్నారు. తద్వారా ఆమెలో ఇతరులకు మేలు చేయవలెననే వాంఛ కలుగగా, వారిని క్రీస్తు వద్దకు తీసుకువచ్చుటకు ప్రయత్నించారు.


    నార్విచ్‌కు దగ్గరలో నివసించే మొహేగన్ ఇండియన్స్ అనే ప్రజలకు సువార్తను తీసుకువెళ్ళాలని నిర్ణయించుకున్నప్పుడు శారాకు ఇరవై ఐదు సంవత్సరాలు. ఆమె వారిని సందర్శించి, సువార్త కరపత్రాలను పంచుతూ క్రీస్తు ప్రేమను గురించి వారికి తెలియపరిచారు. వ్యాఖ్యాతగా ఉన్న మరొక వ్యక్తి తోడ్పాటుతో ఆమె మొహేగన్ పిల్లల కొరకు సండే స్కూల్‌ను ప్రారంభించి, వారికి చదవడం మరియు వ్రాయడం నేర్పించారు. ఆమె గుర్రంపై ప్రయాణిస్తూ మార్గములో కలుసుకున్న వారితో సంభాషించేవారు. ఆమె తన యొక్క ప్రార్థనా సమూహం యొక్క సహాయంతో మొహేగన్ ప్రజల కొరకు "ఛారిటీ  వేర్‌హౌస్" ను కూడా ప్రారంభించారు. అటువంటి పరిచర్య చేస్తున్నప్పటికీ శారాకు మిషనరీగా సేవ చేయాలనే లోతైన వాంఛ ఉండేది. కాగా అమెరికన్ బోర్డ్ ఆఫ్ కమిషనర్స్ ఫర్ ఫారిన్ మిషన్స్ (ఎబిసిఎఫ్ఎమ్) తరఫున సిరియాకు మిషనరీగా వెళ్ళిన ఏలి స్మిత్‌ను వివాహం చేసుకొనుట ద్వారా మిషనరీ సేవ చేయాలనే ఆమె కోరిక నెరవేరింది.


    1833వ సంll లో ఆ దంపతులు అప్పటిలో సిరియా భూభాగమైన లెబానోనులోని బీరుట్‌కు  ప్రయాణమయ్యారు. అక్కడ ఫ్రెంచ్, అరబిక్ మరియు ఇటాలియన్ భాషలను నేర్చుకున్న శారా, తన భర్త చేసే అనువాదాలలో సహాయకారిగా ఉండేవారు. ప్రార్థించుటకు ఎంతో క్రమబద్ధమైన కాలపట్టికను కలిగియుండే ఆమె, ‘స్త్రీల ప్రార్థనా కూడిక’ను కూడా ప్రారంభించారు. క్రైస్తవ సేవ అంటే మాటలకంటే క్రియల పైనే ఎక్కువ దృష్టి కేంద్రీకరించాలని ఆమె విశ్వసించేవారు. కాబట్టి ఆమె ఆతిథ్యమిచ్చుటలో మరియు పేదలకు సేవలందించుటలో తన పరిచర్యను అభివృద్ధి చేశారు. ఆమె ఒక మిషన్ స్కూల్‌ను కూడా స్థాపించి అరబ్ అమ్మాయిలకు బోధించారు. ఆ విధముగా మూడు సంవత్సరాలపాటు మిషనరీగా పరిచర్యలో పాలుపొందిన పిమ్మట ఆమె ఆరోగ్యం క్షీణించడంతో శారా స్మిత్ పరలోక వాసస్థలములో శాశ్వత విశ్రాంతిలోకి ప్రవేశించారు.


    ఈ జీవిత చరిత్ర ద్వారా మనం ఆలోచించాల్సినది : 

    ప్రియమైనవారలారా, మీరు క్రమబద్ధమైన ప్రార్థనా ప్రణాళికను కలిగియున్నారా?


    ప్రార్థన :

    "ప్రభువా, ప్రార్థన కొరకు ఎక్కువ సమయం వెచ్చించుటకును, ఆ విధముగా చేయుటకు ఇతరులను కూడా ప్రోత్సహించుటకును నాకు సహాయము చేయుము. ఆమేన్!" 

    దేవునికే మహిమ కలుగునుగాక!


  • WhatsApp
  • Mar 21, 2022

    Shi Meiyu | షి మేయు

    షి మేయు జీవిత చరిత్ర



    • జననం: 01-05-1873
    • మహిమ ప్రవేశం: 30-12-1954
    • స్వస్థలం: జియుజియాంగ్
    • దేశం: చైనా
    • దర్శన స్థలము: చైనా


    మేరీ స్టోన్ అని కూడా పిలువబడే షి మేయు చైనాలోని ఒక క్రైస్తవ కుటుంబంలో జన్మించారు. ఆమె తండ్రి ఒక మెథడిస్టు పాదిరిగారు మరియు ఆమె తల్లి ఒక క్రైస్తవ పాఠశాల యొక్క ప్రిన్సిపాల్. అమెరికాకు చెందిన ఒక వైద్య మిషనరీయైన డాll కాథరిన్ బుష్నెల్ యొక్క సేవను చూసి ఆకర్షితులైన మేయు యొక్క  తండ్రి, మేయు కూడా ఒక వైద్యురాలు కావాలని కోరుకున్నారు. ఆ అవకాశం మేయు యొక్క పాఠశాల ఉపాధ్యాయురాలు గెర్ట్రూడ్ హోవే ద్వారా లభించింది. ఏలయనగా అమెరికాకు చెందిన మిషనరీయైన గెర్ట్రూడ్ తన యొక్క ఉత్తమ విద్యార్థులలో ఐదుగురిని మిచిగాన్ విశ్వవిద్యాలయానికి తీసుకువెళ్ళవలెనని నిర్ణయించుకొనగా, ఆ ఐదుగురిలో షి మేయు మరియు ఆమె స్నేహితురాలు కాంగ్ చెంగ్ ఉన్నారు. ఒక అమెరికా విశ్వవిద్యాలయం నుండి వైద్య పట్టా పొందిన మొదటి ఇద్దరు చైనా మహిళలు వీరు.


    1896వ సంll లో వైద్య పట్టా పొందిన తర్వాత మేయు మరియు కాంగ్ మెథడిస్టు ఎపిస్కోపల్ చర్చి యొక్క ఉమెన్స్ ఫారిన్ మిషనరీ సొసైటీ తరఫున వైద్య మిషనరీలుగా చైనాకు తిరిగి వచ్చారు. పిమ్మట జియుజియాంగ్‌లో వారు ఒక గదిలో ఆసుపత్రిని ఏర్పాటు చేశారు. వారు ఎలిజబెత్ స్కెల్టన్ డాన్‌ఫోర్త్ మెమోరియల్ హాస్పిటల్ పేరుతో ఒక క్రొత్త ఆసుపత్రిని నిర్మిస్తున్నప్పుడు 1900వ సంll లో చైనాలో క్రైస్తవులు మరియు మిషనరీలకు వ్యతిరేకంగా బాక్సర్ తిరుగుబాటు లేచింది. ఆ తిరుగుబాటు సమయంలో మేయు తన తండ్రిని కోల్పోయారు మరియు ఆమె మరియు కాంగ్ చైనాను విడిచిపెట్టి జపాన్‌లో ఆశ్రయం పొందవలసి వచ్చింది. 1901వ సంll లో చైనాకు తిరిగి వచ్చిన తర్వాత వారు ఆసుపత్రిని ప్రారంభించారు.


    ఆ ఆసుపత్రి నిత్యం రోగులతో కిటకిటలాడుతూ ఉండేది. మరోవైపు, ఆమె చైనా నర్సులకు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు, పాశ్చాత్య వైద్య పాఠ్యపుస్తకాలు మరియు నర్సుల శిక్షణా నియమ సంపుటి పుస్తకములను (ట్రైనింగ్ మాన్యువల్‌) అనువదించారు మరియు నర్సుల కొరకు బైబిలు పఠనములను నిర్వహించారు. తన వృత్తిపరమైన సేవయే కాక ఆమె నలుగురు కుమారులను కూడా దత్తత తీసుకున్నారు.


    ‘చైనీస్ హోమ్ మిషనరీ సొసైటీ’ అనే సంస్థ యొక్క వ్యవస్థాపకులలో మేయు ఒకరు. ఏ క్రైస్తవ వర్గమునకు చెందని దేశీయ మిషన్ అయిన ఈ సంస్థ నైరుతి చైనా ప్రాంతములకు సువార్తను అందించే లక్ష్యముతో స్థాపించబడింది. తరువాత కొంత కాలంపాటు పై చదువుల కొరకు అమెరికా వెళ్ళారు మేయు. చైనాకు తిరిగి వచ్చిన తర్వాత ఆమె మెథడిస్ట్ మిషనరీ సొసైటీని విడిచిపెట్టి, 1920వ సంll లో షాంఘైలో బేతెల్ మిషన్‌ను స్థాపించారు. ఈ మిషన్‌ 17 సంవత్సరాలలో పాఠశాలలు, ఒక ఆసుపత్రి మరియు నర్సింగ్ పాఠశాల, ఒక సెమినరీ (బైబిలు వేదాంతశాస్త్ర శిక్షణాలయం), ఒక అనాథాశ్రమం మరియు ఒక ఆరాధనాలయమును స్థాపించింది. మరొకవైపు నర్సుల కొరకైన తన శిక్షణా కార్యక్రమాన్ని కొనసాగించారు మేయు. దాని ద్వారా చైనీయులకు నర్సులుగా శిక్షణ ఇవ్వడమే కాకుండా వారిని క్రీస్తు వద్దకు నడిపించుటకును మరియు వారిని నర్స్-సువార్తికులుగా మార్చుటకును ఉద్దేశించారు మేయు. తరువాతి సంవత్సరాలలో కాలిఫోర్నియాకు వెళ్ళిన షి మేయు, తన మరణం వరకు అక్కడే నివసించారు.


    ఈ జీవిత చరిత్ర ద్వారా మనం ఆలోచించాల్సినది : 

    ప్రియమైనవారలారా, మీ వృత్తిపరమైన జీవితమును ఇతరులను క్రీస్తు వైపుకు నడిపించుటకును మరియు వారికి సువార్తికులుగా శిక్షణనిచ్చుటకును మీరు ఉపయోగిస్తున్నారా?


    ప్రార్థన :

    "ప్రభువా, ఒక సువార్తికుని హృదయమును మరియు ఇతరులకు సువార్తికులుగా శిక్షణనివ్వవలెననే లోతైన వాంఛను నాలో కలిగించుము. ఆమేన్!" 


    దేవునికే మహిమ కలుగునుగాక!


  • WhatsApp
  • Mar 17, 2022

    Saint Timothy Life History

    సెయింట్ తిమోతి జీవిత చరిత్ర






    జననం : ~ క్రీ.శ. 17

    మరణం : ~ క్రీ.శ. 97

    స్వస్థలం : లుస్త్ర (ప్రస్తుత టర్కీలో)

    దర్శన స్థలము : ఎఫెసు


    'దేవునిని ఘనపరచుట' అనే అర్థమిచ్చే పేరుగల తిమోతి, అపొస్తలుడైన పౌలు యొక్క శిష్యుడు మరియు ఎఫెసు సంఘము యొక్క మొట్టమొదటి బిషప్పు. అతని తల్లి ఒక యూదురాలు, తండ్రి గ్రీసు దేశమునకు చెందిన అన్యుడు. చిన్నప్పటి నుండీ తిమోతి తన తల్లియైన యునీకే మరియు అవ్వయైన లోయి మాదిరిగానే దేవునియందు విశ్వాసము కలిగియున్నారు. పౌలు లుస్త్రకు వచ్చి పరిచర్య చేసినప్పుడు తిమోతి యేసు క్రీస్తు యొక్క సువార్తను అంగీకరించి, పౌలు యొక్క శిష్యునిగా మారారు.


    పౌలు యొక్క రెండవ మరియు మూడవ మిషనరీ యాత్రలలో అతనితో కలిసికొనిన తిమోతి, పురాతన పట్టణములైన కొరింథు, థెస్సలొనీక మరియు ఫిలిప్పీలలో క్రైస్తవ సంఘములను స్థాపించుటలో తోడ్పడ్డారు. తిమోతిని తన కుమారుని వలె ప్రేమించిన పౌలు, అతను విశ్వాసములో ఎదిగేకొద్దీ సేవలో ముఖ్యమైన కార్యకలాపాలకు అతనిని నియమించారు. స్థానిక సంఘములను బలపరచుటలో పౌలుతో కూడ నిలిచిన తిమోతిని ప్రభువు ఎంతో బలముగా వాడుకున్నారు. అతను సువార్త యొక్క లోతైన సత్యమును కాపాడుటలో ఎంతో జాగ్రత్త వహించారు. సువార్తను వ్యతిరేకించే వారితో విభేదాలు తలెత్తిన పరిస్థితులలో, అతను తన హృదయములో సత్యమును భద్రపరచుకొని, దానిని అన్వయించుకొని, తన విశ్వాసమును గట్టిగా పట్టుకొని వారిని తీవ్రంగా ఖండించేవారు.


    అతని సమకాలీనులలో తక్కినవారు తమ స్వార్థపూరిత మార్గముల పట్ల వాంఛకలిగియుండగా, తిమోతి మాత్రం విశ్వాసుల పట్ల నిజమైన శ్రద్ధ వహించారు. ఎఫెసు సంఘమునకు పరిచర్య చేయుటకు పౌలు అతనిని నియమించారు. అక్కడ సేవ చేసే సమయములో ఆత్మ ద్వారా నింపబడియున్నామని వంచించే వంచకులను తిమోతి ఎదుర్కొనవలసి వచ్చింది. తాను పొందియున్న ఆత్మ వరములను ప్రజ్వలింప చేయుట ద్వారా తప్పుడు బోధనల మధ్యలో అతను సువార్త సత్యమును స్థిరముగా నిలువబెట్టుటకు తీవ్రంగా ప్రయత్నించారు. శ్రమలు, హింస మరియు వ్యతిరేకతల మధ్యలో తన రక్షకుని గురించి మాటలాడుటకు అతను ఏనాడూ సిగ్గుపడలేదు. సంఘ కాపరిగా తన కర్తవ్యాలను సమర్థవంతముగా నిర్వర్తించిన తిమోతి, దేవుని వాక్య సత్యమును ఎంతో ఖచ్చితముగా వివరించేవారు. తద్వారా అనేకమంది శిష్యులు మరియు విశ్వాసులు లోతైన క్రైస్తవ సిద్ధాంతములను గూర్చిన జ్ఞానమును కలిగియుండగలుగునట్లు నడిపించబడ్డారు.


    యేసు క్రీస్తు యొక్క శిష్యునిగా కొనసాగుటలో తన జీవితములో తిమోతి ఏనాడూ వెనుకంజ వేయలేదు. తత్ఫలితముగా అతను శ్రమలను, హింసను ఎదుర్కొని హతసాక్షిగా మరణించవలసి వచ్చింది. బయలును అనుసరించేవారి దేవత పూజింపబడుటను వ్యతిరేకించినందు వలన ఆ జనసమూహం అతనిని చంపినట్లు చెప్పబడుతుంది. 


    ప్రియమైనవారలారా, తమ స్వప్రయోజనాలనే వెంటాడే మనుష్యులున్న ఈ లోకములో దేవుని పరిచర్య పట్ల నిజమైన భారాన్ని మీరు కలిగియున్నారా?


    "ప్రభువా, తిమోతి వలె నమ్మకమైన పరిచర్య చేయుటకు నాకు సహాయము చేయుము. ఆమేన్!"


    దేవునికే మహిమ కలుగునుగాక!

  • WhatsApp
  • Feb 12, 2022

    Sherwood Eddy Life History

    షెర్వుడ్ ఎడ్డీ జీవిత చరిత్ర




    • జననం: 19-01-1871
    • మహిమ ప్రవేశం: 04-03-1963
    • స్వస్థలం: కాన్సాస్
    • దేశం: అమెరికా సంయుక్త రాష్ట్రాలు
    • దర్శన స్థలము: భారతదేశం మరియు చైనా

     అమెరికాకు చెందిన మిషనరీయైన జార్జ్ షెర్వుడ్ ఎడ్డీ, తాను భారతదేశం మరియు చైనా దేశాలలో అలుపెరుగక జరిగించిన సంచార పరిచర్యకు పేరుగాంచినవారు. 1889వ సంll లో ఒక క్రైస్తవ కూడికలో అతను తిరిగి జన్మించగా, అప్పటి నుండి నశించుచున్న ఆత్మలను రక్షించుటకు లోతైన భారము అతనిలో ఏర్పడింది. తన తండ్రి మరణం తరువాత గొప్ప సంపదను అతను వారసత్వంగా పొందినప్పటికీ, దానిపట్ల అతను పెద్దగా ఆసక్తి చూపలేదు. ఇంజనీరింగ్ చదువు పూర్తిచేసుకొనిన పిమ్మట అతను "ఈ తరంలో ప్రపంచానికి సువార్త ప్రకటించాలి" అనే దర్శనముతో 'యంగ్ మెన్స్ క్రిస్టియన్ అసోసియేషన్' (వై.ఎమ్.సి.ఎ. - క్రైస్తవ యువకుల సంఘము) అనే సంస్థలో చేరారు.

    అమెరికాలో చురుకుగా పరిచర్య చేస్తున్న సమయములో అతను తన స్నేహితుడు జాన్ మోట్ భారతదేశం మరియు శ్రీలంకలలో 'స్టూడెంట్ వాలంటీర్ మూవ్‌మెంట్' (ఎస్.వి.ఎమ్. - విద్యార్థి స్వచ్ఛంద విప్లవం) అను దానిని నడిపించుటను గురించి వినడం జరిగింది. దేవుని యొక్క ఉన్నతమైన ప్రణాళికను బట్టి భారతదేశములో పరిచర్య చేయుట కొరకు అతను వై.ఎమ్.సి.ఎ. వారి అంతర్జాతీయ కమిటీచే ఎంపిక చేయబడినవారై 1896వ సంll లో భారతదేశము లోని బొంబాయికి చేరుకున్నారు.

    అతను అక్కడికి వచ్చిన సమయంలో బుబోనిక్ ప్లేగు విజృంభిస్తుండుట వలన బొంబాయి నగరం అల్లాడిపోతున్నది. కాగా అతను వెంటనే బ్రిటిషువారి బృందముతో కలిసి ప్రజలకు వైద్య సంరక్షణ అందించుటకును మరియు వారిని రక్షించుటకును ప్రారంభించారు. అటుపిమ్మట అతను భారతదేశంలోని అనేక నగరాలలో తీవ్రమైన సంచార పరిచర్యను ప్రారంభించారు. ఒక దేశమును క్రైస్తవ దేశముగా మార్చుటకు ప్రధాన ద్వారం క్రీస్తు కొరకు యవ్వనస్థులను సంపాదించుటయేయని ఎడ్డీ విశ్వసించారు. ప్రారంభములో అతను సువార్తను బోధించుటకు వాదనలు మరియు విమర్శలతో కూడిన విధానమును అనుసరించారు. అయితే, దాని ద్వారా వచ్చిన సత్ఫలితాలు చాలా తక్కువ. ఒకానొక సమయంలో అతను స్వామి వివేకానంద మరియు మహాత్మా గాంధీలతో కూడా వాదించారు. అయితే తరువాత అతను "మనము వాదనలలో గెలుచుటకు కాదు గానీ, ప్రజలను గెలవడానికి పంపబడ్డాము" అని గ్రహించారు. తత్ఫలితముగా అతను స్థానికుల అవసరతలకు తగినట్లు సందర్భోచితంగా సువార్తను చెప్పడం ప్రారంభించి, వారి జీవితములలో క్రీస్తు నిజముగా అవసరమని వారు విశ్వసించేలా చేశారు.

    1900వ సంll లో తమిళనాడులో సేవ చేయడం ప్రారంభించారు ఎడ్డీ. అనేక వర్గాలతో విభజించబడియున్న క్రైస్తవ్యం దేవుని రాజ్యానికి ఆటంకం కలుగజేస్తుందే గానీ, దానిని విస్తరింపజేయదు అని అతను భావించారు. అందువలన అతను వి.ఎస్. అజర్యాతో కలిసి 1903వ సంll లో తిన్నెవెల్లికి చెందిన 'ఇండియన్ మిషన్ సొసైటీ' ని స్థాపించారు మరియు అన్ని క్రైస్తవ వర్గాలను, వివిధ క్రైస్తవ సమూహాలను సువార్త ప్రకటన అనే ఒకే గురివైపు మళ్ళించవలెననే భారంతో 1905వ సంll లో 'నేషనల్ మిషనరీ సొసైటీ ఆఫ్ ఇండియా' అనే సంస్థను స్థాపించారు. 

    భారతదేశములో చేసిన పరిచర్య నుండి పొందిన అనుభవముతో మరియు నేర్చుకొనిన పాఠాలతో అతను 1911వ సంll నుండి ఆసియాలోని అనేక దేశాలను పర్యటిస్తూ, ప్రభావవంతమైన సువార్త పరిచర్యను చేయడం ప్రారంభించారు. 1931వ సంll లో పదవీ విరమణ పొందిన తరువాత కూడా ప్రపంచవ్యాప్తంగా మిషన్‌లను జరిగించుటలో చురుకైన పాలిభాగస్థులుగా చివరి వరకు ప్రభు సేవలో సాగిపోయారు జార్జ్ షెర్వుడ్ ఎడ్డీ. 

    ఈ జీవిత చరిత్ర ద్వారా మనం ఆలోచించాల్సినది : 

    ప్రియమైనవారలారా, మీరు వాదనలలో గెలుపును సాధిస్తున్నారా లేక ఆత్మలను గెలుస్తున్నారా?

    ప్రార్థన :


    ప్రభువా, మీ మహిమార్థమై ఫలభరితమైన పరిచర్యను చేయుటకు నాకు సహాయము దయచేయుము. ఆమేన్!

    దేవునికే మహిమ కలుగునుగాక!


  • WhatsApp
  • Dec 12, 2021

    Sophia Blackmore Life History

    సోఫియా బ్లాక్‌మోర్ గారి జీవిత చరిత్ర



    • జననం: 18-10-1857
    • మహిమ ప్రవేశం: 03-07-1945
    • స్వస్థలం: గౌల్బర్న్
    • దేశం: ఆస్ట్రేలియా
    • దర్శన స్థలము: సింగపూర్

     దైవభక్తి గల కుటుంబంలో జన్మించిన సోఫియా బ్లాక్‌మోర్ దేవుని యందలి భయభక్తులతోను మరియు ఆత్మీయ క్రమశిక్షణలోను పెరిగారు. కొంతమంది గొప్ప మిషనరీలతో సంబంధం కలిగియున్న సోఫియా యొక్క తల్లిగారు చిరుప్రాయంలో ఉన్న సోఫియాకు చైనాలో వారి సేవను గురించి చెబుతుండేవారు. ఇరవై ఏళ్ళ ప్రాయంలో సోఫియా అమెరికాకు చెందిన ఒక మెథడిస్టు సువార్తికురాలైన ఇసాబెల్లా లియోనార్డ్‌ను కలుసుకొనడం జరిగింది. కాగా క్రీస్తు ఆమె కొరకు ఏమి పొందుపరచి ఉంచాడో వాటన్నింటినీ ఆసక్తితో వెతుకవలెనని ఇసాబెల్లా సోఫియాకు సలహా ఇచ్చారు. ఆ సలహా ఆమెను లోతుగా కదిలించగా మిషనరీగా మారుటకు ఆమె జీవిత ప్రయాణం ప్రారంభమయ్యింది.

     అయితే, అవివాహితలైన స్త్రీలను మిషనరీలుగా పంపుటకు ఆస్ట్రేలియా క్రైస్తవ సంఘం అప్పటిలో మద్దతు ఇవ్వలేదు. కానీ దేవుడు ఇసాబెల్లా ద్వారా సోఫియాకు మార్గమును సరాళం చేశాడు. ఆమె సోఫియాను తన సహాపరిచారకురాలిగా భారతదేశానికి తీసుకువెళ్ళుటకు ముందుకువచ్చారు. దేవుని వాగ్దానాలు మాత్రమే తనకు మద్దతుగా తీసుకొని భారతదేశానికి పయనమయ్యారు సోఫియా. అయితే, ఏదో ఒక రోజున చైనాలో సేవ చేయాలనేది ఆమె దృక్పథం. కానీ ఆమె భారతదేశంలో సేవ చేస్తున్నప్పుడు ఆమె సింగపూర్‌లోని ఆంగ్లో-చైనీస్ పాఠశాలలో పని చేయుటకు ఒక మహిళా మిషనరీ కొరకు వెతుకుతున్న విలియం ఓల్డ్‌హామ్‌ అనే మిషనరీని కలవడం జరిగింది.

     అది దేవుని చిత్తమని ఎరిగినవారై, అప్పటికే తమిళంలో పట్టు సాధించిన సోఫియా మలాయ్ భాషను నేర్చుకొనడం ప్రారంభించారు. దేవుని ఏర్పాటులోను మరియు ఓల్డ్‌హామ్ మార్గదర్శకత్వంలోను 1887వ సంll లో ఆమె సింగపూర్ చేరుకున్నారు. సింగపూర్‌కు వచ్చిన ఒక నెలలోనే అక్కడ ఆమె ఒక తమిళ బాలికల పాఠశాలను ప్రారంభించారు. తరువాత ఆ పాఠశాల ‘మెథడిస్ట్స్ గర్ల్స్ స్కూల్’ (మెథడిస్టువారి బాలికల పాఠశాల) అని పిలువబడింది. త్వరలోనే చైనాటౌన్‌ అనే ప్రాంతంలో ఆమె ఒక మిషన్ కేంద్రమును స్థాపించి, పెరనాకన్ చైనా మహిళలను సందర్శించడం ప్రారంభించారు. అక్కడి స్త్రీలు సత్యమును మరింతగా తెలుసుకొనవలెననే ఆసక్తిని కలిగియున్నవారై యేసు క్రీస్తును గురించి తమ పిల్లలకు బోధించవలసినదిగా ఆమెను కోరారు.

     అంతేకాదు, పిల్లల అక్రమ రవాణా నుండి తప్పించుకున్న బాలికల కొరకు ఒక గృహమును స్థాపించవలసిన ఆవశ్యకతను కూడా సోఫియా గ్రహించారు. ఆ గృహము బాలికలకు ఒక క్రైస్తవ వాతావరణాన్ని కల్పించింది. తమ అవసరతలన్నింటికీ పరలోకపు తండ్రిపైనే ఆధారపడవలెనని వారికి బోధించబడింది. మలాయ్ భాష యొక్క అభ్యాసంలో భాగంగా బాలికలకు మలాయ్‌ భాషలో బైబిలు వచనములను చదవడం, వ్రాయడం మరియు కంఠస్థం చేయుటకు నేర్పించబడింది. ఆమె వారికి నిర్వహించిన సండే స్కూల్ తరగతులు సింగపూర్‌లోని తొలి మెథడిస్టు సంఘములకు పునాదిగా మారాయి.

     సింగపూర్‌లో 40 ఏళ్లపాటు సేవ చేసిన తర్వాత 1928వ సంll లో ఆస్ట్రేలియాకు తిరిగి వచ్చిన సోఫియా బ్లాక్‌మోర్ 88 ఏళ్ల వయసులో పరమవాసమును చేరుకున్నారు.
    ప్రియమైనవారలారా, దేవుని చిత్త ప్రకారమే మీరు పరిచర్య చేయుచున్నారా?

    "ప్రభువా, నా ఆలోచనలు, ప్రణాళికలను విడిచిపెట్టి, దైవిక నడిపింపు మరియు సంకల్పం ప్రకారమే సేవ చేయుటకు నాకు సహాయము దయచేయుము. ఆమేన్!"

    దేవునికే మహిమ కలుగునుగాక!
  • WhatsApp
  • Dec 6, 2021

    Samanyudavu Kaavu | సామాన్యుడవు కావు

    Samanyudavu Kaavu | సామాన్యుడవు కావు


    హేపీ క్రిస్మస్ హేపీ క్రిస్మస్ హేపీ హేపీ హేపీ క్రిస్మస్ 

    మెర్రీ క్రిస్మస్ మెర్రీ క్రిస్మస్ మెర్రీ మెర్రీ మెర్రీ క్రిస్మస్ (2)


    సామాన్యుడవు కావు సృష్టికర్తవు నీవు - బలహీనుడవు కావు బలమైన దేవుడవు (2)

    పాపిని రక్షింప యేసు పరమును వీడావు చీకటి - తొలగించి మాలో వెలుగును నింపావు (2)


    1. ఆదాము హవ్వలు చేసిన పాపం శిక్షను తెచ్చిందీ (2)

    క్రీస్తు చేసిన త్యాగం మనకు రక్షణ నిచ్చింది (2) ||హేపీ క్రిస్మస్||


    2. జ్ఞానులు గొర్రెలకాపరులు ప్రభువుని చూశారు (2)

    దీనులైన వారలకు ఆ భాగ్యం దొరికింది (2) ||హేపీ క్రిస్మస్||


    3. యేసుని నీవు నమ్మినచో శాంతి సమాధానం (2) నిత్యమైన సంతోషం పరలోకమే నీ సొంతం (2) ||హేపీ క్రిస్మస్||






  • WhatsApp
  • Nov 16, 2021

    Sandhadi | సందడి | Joyful Noise | Telugu Christmas song


    Sandhadi (Joyful Noise) Christmas Song

    బెత్లేహేములోనంట సందడి పశువుల పాకలో సందడి
    దూతలు వచ్చేనంట సందడి పాటలు పాడేనంట
    రారాజు బుట్టేనని సందడి మారాజు బుట్టేనని సందడి
    చేసారంట సందడే సందడి చేయబోదాము సందడే సందడి

    Happy happy Christmas Christmas
    Wish you a happy Christmas
    Merry merry Christmas Christmas
    Wish you a merry Christmas

    అర్థరాత్రి వేళలో సందడి దూతాలు వచ్చెనంట సందడి
    రక్షకుడు బుట్టేనని సందడి వార్తను తెలిపేనంట


    ‘’ రారాజు బుట్టేనని’’


    గొల్లలు వచ్చిరంట సందడి మనసార మ్రొక్కిరంట సందడి
    అందాల బాలుడంట సందడి అందరి అందరి దేవుడని సందడి


    ‘’ రారాజు బుట్టేనని’’


    తారను చూచుకుంటూ సందడి జ్ఞానులు వచ్చారంట సందడి
    పెట్టెలు తెచ్చారంట సందడి కానుకలు ఇచ్చారంట సందడి


    ‘’ రారాజు బుట్టేనని’’


  • WhatsApp
  • Oct 22, 2021

    Susan Higgins | సూసన్ హిగ్గిన్స్

    సూసన్ హిగ్గిన్స్  | Susan Higgins జీవిత చరిత్ర




    • జననం: 1842
    • మహిమ ప్రవేశం: 03-07-1879
    • స్వస్థలం: మెయిన్
    • దేశం: అమెరికా సంయుక్త రాష్ట్రాలు
    • దర్శన స్థలము: యోకోహామా, జపాన్

    అమెరికాకు చెందిన సూసన్ హిగ్గిన్స్ జపాన్‌లో ఒక ప్రముఖ మహిళా మిషనరీ. క్రైస్తవ బోధకుల కుటుంబంలో జన్మించిన ఆమె దేవుని యందు భయభక్తులు కలిగిన బాలికగా ఎదిగారు. సూసన్ యొక్క చిన్నతనంలోనే మరణించిన ఆమె తల్లియైన శారా హిగ్గిన్స్ ఆత్మీయపరంగా ఆమెకు మాదిరిగా నిలిచారు. "నాకు పదకొండేళ్ళ వయసు ఉన్నప్పుడు నా రక్షకుని గాయపడిన హస్తాలు నా హృదయ ద్వారమును సున్నితముగా తట్టుట నాకు స్పష్టముగా గుర్తుంది" అని తన రక్షణ అనుభవము గురించి వివరిస్తారు సూసన్.


    క్రైస్తవ అనుభవం ప్రారంభంలో ఆమె మిషనరీ సేవ పట్ల ఎంతో ఆసక్తిని కనబరిచారు. పాఠశాల చదువు పూర్తిచేసుకొనిన తరువాత ఆమె ఏదో ఒకరోజున దేవుడు తనను పరిచర్యకై పిలవవచ్చనే ఆలోచనతో ఆనందించేవారు. కొన్నిసార్లు క్రైస్తవాలయంలో కానుకల కొరకు ప్రకటించబడినప్పుడు, ఒక యవ్వన బాలికగా స్వంత డబ్బును కలిగిలేని ఆమె "నన్నే నేను అర్పించుకుంటున్నాను" అని వ్రాసి కానుకల పెట్టెలో వేయవలెనని ఉవ్విళ్ళూరేవారు. అయితే, ఆమె బిడియం మరియు దేవునికి సేవ చేయుటకు తాను అర్హురాలు కాదు అనే భావన మిషనరీ సేవకు సమర్పించుకొనకుండా ఆమెను నిరోధించాయి.


    1878వ సంll లో ఒక రోజు ఆమె ‘ఉమెన్స్ ఫారిన్ మిషనరీ సొసైటీ’ (డబ్ల్యూ.ఎఫ్.ఎమ్.ఎస్. - మహిళా విదేశీ మిషనరీ సొసైటీ) సమావేశానికి హాజరయ్యారు. అప్పుడు అకస్మాత్తుగా ఒక మహిళ సూసన్ వద్దకు వచ్చి, "మేము నిన్ను కొంతకాలం మిషనరీగా పంపగలమని అనుకుంటున్నాను" అని చెప్పింది. "ఎప్పుడైనా సరే" అనునది సూసన్ యొక్క తక్షణ ప్రతిస్పందన. త్వరలోనే, డబ్ల్యూ.ఎఫ్.ఎమ్.ఎస్. సంస్థ ఆమెను జపాన్‌లోని యోకోహోమాలో పని చేయుటకు నియమించింది. అది క్రైస్తవులకు ఎంతో కష్టమైన ప్రదేశం.


    1878వ సంll నవంబరు మాసంలో యోకోహామా చేరున్నారు సూసన్. వెంటనే ఆమె జపనీస్ భాషను నేర్చుకొనుట ప్రారంభించారు. ఆమె ఆంగ్లమును బోధించే ఉపాధ్యాయురాలిగా పనిచేశారు మరియు పిల్లల కొరకు ఆదివారపు పాఠశాలను (సండే స్కూల్) కూడా నిర్వహించారు. కొన్ని నెలల వ్యవధిలోనే ఆమె జపనీస్‌ భాషలో బైబిలు తరగతులను కూడా నిర్వహించడం ప్రారంభించారు. ఆమె కేవలం క్రీస్తు కొరకు పిల్లలను సంపాదించుట పైనే తన దృష్టిని కేంద్రీకరించలేదు కానీ, వారి గృహములోను మరియు సమాజములోను వారు స్వతహాగా సాక్ష్యులుగా నిలబడుటకు వారిని ప్రేరేపించుట పై కూడా తన దృష్టి సారించారు. ఆమె పాఠశాల ప్రయోజనాల నిమిత్తం సమీప గ్రామాలను సందర్శించేవారు. ఆ సందర్భాలను ఆమె సువార్తను ప్రకటించుటకు అవకాశాలుగా ఉపయోగించుకున్నారు.


    అయితే పరిచర్య చేసిన ఒక సంవత్సర కాలంలోనే ఆమె అకస్మాత్తుగా అనారోగ్యానికి గురయ్యారు. తన సమయం వచ్చిందని గ్రహించిన ఆమె తన చుట్టూ పిల్లలను సమకూర్చుకొని ఒక పాట పాడమని వారిని అడిగారు. పిల్లలు ఆఖరి చరణమును పాడుచుండగా దేవునిలో శాశ్వత విశ్రాంతిని పొందారు సూసన్ హిగ్గిన్స్.

    ఈ జీవిత చరిత్ర ద్వారా మనం ఆలోచించాల్సినది : 

    ప్రియమైనవారలారా, మీ కానుకల కంటే ఎక్కువగా దేవుడు మీ సేవనే కోరుకుంటున్నాడని ఎల్లప్పుడూ మీరు జ్ఞప్తికి తెచ్చుకుంటున్నారా? 

    ప్రార్థన :

    "ప్రభువా, నన్ను నేను మీకు అర్పించెదను. మీ మహిమార్థమై నన్ను వాడుకొనుము. ఆమేన్!" 

    దేవునికే మహిమ కలుగునుగాక!


  • WhatsApp
  • Oct 1, 2021

    Sarah Hall | శారా హాల్

    శారా హాల్  | Sarah Hall 


    • జననం: 1803
    • మహిమ ప్రవేశం: 1845
    • స్వదేశం: అమెరికా సంయుక్త రాష్ట్రాలు
    • దర్శన స్థలము: బర్మా


    శారా హాల్ 13 మంది పిల్లలలో జ్యేష్ఠురాలు. మంచి జ్ఞానవంతురాలైన ఆమె, నాలుగేళ్ల వయసులోనే ఏది ఇచ్చినా చదవగలిగేవారు. చాలా చిన్న వయస్సు నుండే తనకు మిషనరీ సేవ కొరకైన పిలుపు ఉన్నట్లు ఆమె భావించారు. జార్జ్ బోర్డ్‌మన్‌తో ఆమెకు వివాహం జరిగినప్పుడు ఆ కోరిక నెరవేరింది. ఈ దంపతులు 1825వ సంll లో బర్మాకు పయనమయ్యారు. అయితే, అప్పటికి బ్రిటిష్-బర్మీస్ యుద్ధం ఇంకా కొనసాగుతున్నందున వారు కొంతకాలం భారతదేశంలో ఉండవలసి వచ్చింది.


    భారతదేశంలో ఉన్నప్పుడు వారు భాషను అధ్యయనం చేయడంలో సమయమును సద్వినియోగపరచుకున్నారు. అక్కడ జన్మించిన వారి మొదటి కుమారుడు అక్కడే మరణించి, భూస్థాపనం చేయబడ్డాడు. చివరకు 1827వ సంll లో వారు బర్మాకు వెళ్ళగలిగారు. అక్కడ మొదటిగా అమ్హెర్స్ట్‌లో వారు తమ మిషన్‌ను స్థాపించారు. తదుపరి దానిని మౌల్‌మైన్‌కు తరలించగా, అక్కడ వారికి ‘కరెన్’ అనే గిరిజన తెగవారితో పరిచయమేర్పడింది. సామాన్యమైన చిన్నపాటి వ్యవసాయదారులైన ఈ తెగ ప్రజలు దేవుని వాక్యమును వినుటకు పెద్ద సంఖ్యలో తరలి వచ్చేవారు. వారిలో అనేక మంది యేసు క్రీస్తు ప్రభువును విశ్వాసించారు. ఒక వ్యక్తి జీవితమైతే ఒక ప్రత్యేక ఆశీర్వాదమని చెప్పవచ్చు. అతను ఒక పేరొందిన నేరస్థుడు. 30కి పైగా హత్యలు చేసినట్లు అంగీకరించినవాడు. కానీ, అతను యేసు క్రీస్తు ప్రభువును విశ్వసించినప్పుడు అతని జీవితం పూర్తిగా మారిపోయింది. దేవునికి బలమైన సాక్ష్యముగా అతను నిలిచాడు. అంతేకాదు, ఒక మంచి సువార్తికుడయ్యాడు.


    బోర్డ్‌మన్ దంపతులు తరువాత టావోయ్‌కు వెళ్ళగా, అక్కడ బోర్డ్‌మన్ యొక్క ఆరోగ్యం వేగంగా క్షీణించింది. అంతేకాక, ఆ దంపతులు తమ రెండవ బిడ్డను కూడా కోల్పోయారు. కష్టాలలోనైనా, సంతోషంలోనైనా వారు ఆత్మలను రక్షించవలెననిన గొప్ప లక్ష్యము పైనే గురియుంచి సమర్పణతో శ్రమించారు. బోర్డ్‌మన్ దంపతులు నిజమైన మార్గదర్శకులైన మిషనరీలు. వారు కాలినడకన పర్వత ప్రాంతాలలో విస్తృతంగా ప్రయాణించి అక్కడి ఆదివాసీలకు సువార్తను అందించారు. వారు అనేక లేఖన భాగములను అనువదించారు. శారా అనేక పాఠశాలలను ప్రారంభించి, వాటి ద్వారా బైబిలును బోధించారు. పిల్లల కారణంగా ఆమె మిషనరీ పనిలో ఎక్కువ సమయం గడపలేకపోయినప్పుడు ఆమె పాటలను వ్రాశారు. అన్యదేవతలను పూజించే మరొక తెగ ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు, ఆమె వారి భాషను నేర్చుకొని, క్రైస్తవ రచనలను ఆ భాషలోకి అనువదించారు. 1845వ సంll లో తాను మహిమనందు ప్రవేశించు వరకు కూడా క్రీస్తు కొరకు శ్రమించి, ఎంతో సాధించిన ఒక అద్భుతమైన స్త్రీ శారా హాల్.


    ప్రియమైనవారలారా, ఈ భూమిపై దేవుని రాజ్యమును విస్తరింపజేయుటకు మీరు మీ తలాంతులను ఉపయోగిస్తున్నారా?

     "ప్రభువా, ఎటువంటి పరిస్థితులలోనైనా నేను మీకు సేవ చేయగలుగునట్లు నాకు కృపననుగ్రహించుము. ఆమేన్!" 

     దేవునికే మహిమ కలుగునుగాక! 

  • WhatsApp
  • Silas Mead | సిలాస్ మీడ్

     సిలాస్ మీడ్ | Silas Mead



    • జననం: 16-08-1834
    • మహిమ ప్రవేశం: 13-09-1909
    • స్వస్థలం: సోమర్‌సెట్
    • దేశం: ఇంగ్లాండు
    • దర్శన స్థలము: ఆస్ట్రేలియా


    ఆంగ్లేయుడైన సిలాస్ మీడ్ ఆస్ట్రేలియాలో సేవ చేసిన ఒక బాప్తిస్టు మిషనరీ. ఒక వ్యవసాయ కుటుంబములో జన్మించిన మీడ్ పారంపర్యంగా వస్తున్న వ్యవసాయమును కొనసాగించుట కంటే దైవిక జీవితము పట్ల ఎక్కువ ఆసక్తిని కలిగియుండేవారు. 15 సంll ల వయస్సులో బాప్తిస్మం పొందిన అతను, త్వరలోనే వారి నగరంలో సువార్త ప్రకటించడం మరియు క్రైస్తవాలయంలో బోధించడం ప్రారంభించారు. అతను బైబిలు వేదాంతశాస్త్రంలో పట్టా పొందుటకుగాను రీజెంట్స్ పార్క్ కళాశాలలో చేరగా, అక్కడి కళాశాల ప్రిన్సిపాల్ అయిన జోసెఫ్ యాంగస్‌ పరిచర్య యెడల మీడ్ కలిగియున్న అవగాహనా దృష్టిని విస్తరింపచేశారు.


    పట్టభద్రులైన పిమ్మట ‘బాప్టిస్ట్ మిషనరీ సొసైటీ’ లో చేరుటకు దరఖాస్తు పెట్టుకున్నారు మీడ్. కానీ అతని అభ్యర్థన అంగీకరించబడలేదు. అయితే, ఆస్ట్రేలియాకు చెందిన విశ్వాసుల బృందం వారి మధ్య సేవ చేయుటకు ఒక పాదిరి వారికి కావలెనని కోరినప్పుడు సేవ చేయుటకు అవకాశం అతని తలుపు తట్టింది. యాంగస్ ప్రోత్సాహంతో, మీడ్ వెంటనే ఆ ఆహ్వానమును అంగీకరించి, 1861వ సంll లో ఆస్ట్రేలియాలోని అడిలైడ్ నగరమునకు చేరుకున్నారు. అతను బాగా ఆకట్టుకునే బోధకునిగా కనిపించకపోయినప్పటికీ, సువార్త ప్రకటన పట్ల ఎంతో ఆసక్తి ఉత్సాహములతో అతను నిండుకొనియుండెడివారు. స్థానిక ప్రజలను క్రీస్తు వద్దకు తీసుకువచ్చుటకు తన భార్యతో పాటు అతను ఎంతో శ్రమించారు. త్వరలోనే అతను ‘ఫ్లిండర్ స్ట్రీట్ బాప్టిస్ట్ చర్చి’ ని నిర్మించగా, 5 సంll ల లోగానే ఆ సంఘములో 263 మంది సభ్యులు సమకూడారు.


    ఒకవైపు పరిచర్య అభివృద్ధి చెందుతుండగా, మరొకవైపు మీడ్‌కు వ్యక్తిగత జీవితములో నిరాశలు ఎదురయ్యాయి. టైఫాయిడ్ జ్వరం కారణంగా అతని భార్య మరణించగా అతను హృదయ వేదనతో కృంగిపోయారు. ఐదుగురు పిల్లలను పెంచవలసిన బాధ్యత మరియు ఎదుగుతున్న సంఘ బాధ్యత అతని భుజాల పైనే పడింది. అయినప్పటికీ ఏనాడూ వెనుకంజ వేయక పరిచర్యను అడిలైడ్ హద్దులను మీరు విస్తరింపజేయుచూ ముందుకు సాగిపోయారు మీడ్‌. బాప్తిస్టు మిషన్‌ను ఐక్యపరిచి, ఉజ్జీవింపజేసి విస్తరింపజేయుటకుగాను అతను ‘సౌత్ ఆస్ట్రేలియా బాప్టిస్ట్ అసోసియేషన్‌’ ను స్థాపించి నడిపించారు. క్రైస్తవ్యములో ఐక్యత లేకపోవడమే సువార్త వ్యాప్తికి తీవ్రమైన అవరోధముగా ఉన్నదని అతను విశ్వసించారు. ఆత్మీయముగా ఎదిగిన విశ్వాసులు తమ క్రైస్తవ సంఘములను విడిచి మారుమూల ప్రాంతములకు వెళ్ళి నూతన సంఘములను స్థాపించవలెనని వారిని ప్రోత్సహించేవారు.


    భారతదేశంలో కూడా ‘సౌత్ ఆస్ట్రేలియా బాప్టిస్ట్ మిషనరీ సొసైటీ’ స్థాపించబడటం మరియు ‘ఫ్యూరిడ్‌పోర్ మిషన్‌’ ప్రారంభించబడటం వెనుక మీడ్ క్రియాశీలక వ్యక్తిగా ఉన్నారు. తరువాతి కాలంలో అతని కుమారుడు సిసిల్ మీడ్ అదే మిషన్‌లో సేవ చేయుటకు భారతదేశానికి వచ్చారు. తన వృద్ధాప్యంలో కూడా అలుపెరుగక సేవలో ముందుకు సాగిపోయిన సిలాస్ మీడ్, 1909వ సంll లో మహిమలోకి పిలువబడే వరకు కూడా అనేక క్రైస్తవ సంస్థలను నడిపిస్తూ, సలహాలనిస్తూ దేవునికి నమ్మకమైన దాసునిగా జీవించారు.


    ప్రియమైనవారలారా, మీరు చేసే సేవలో ఈ లోకం క్రీస్తు ప్రేమను చూడగలుగుతుందా?


     "ప్రభువా, నా వ్యక్తిగత జీవితములో నిరాశలు ఎదురైనప్పటికీ, మిమ్ములను సేవించుటలో ఎల్లప్పుడూ ఆనందించుటకు నాకు సహాయము దయచేయుము. ఆమేన్!" 

    దేవునికే మహిమ కలుగునుగాక! 

  • WhatsApp
  • Sep 28, 2021

    Sannuthintuneppudu Yehovanu | సన్నుతింతు నెప్పుడెహోవాను

    "నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదను. నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును." కీర్తన Psalm 34:1-10


    పల్లవి : సన్నుతింతు నెప్పుడెహోవాను తన కీర్తి నా నోట నుండును

    1. అతిశయింతు నెహోవానుబట్టి
    సంతోషింతురు దీనులు విని || సన్నుతింతు ||

    2.ఘనపరచుడి దేవుని పేరు
    గొప్ప చేయుదము ఏకముగా || సన్నుతింతు ||

    3. తనయొద్ద నే విచారించగా
    తప్పించె నన్ను భయముల నుండి || సన్నుతింతు ||

    4. తనను చూడగ వెల్గు కలిగెను
    తమ ముఖములు లజ్జింపకుండె || సన్నుతింతు ||

    5. యెహోవా భక్తులందరి చుట్టు
    దూత కావలి యుండి రక్షించు || సన్నుతింతు ||

    6. దేవుడుత్తముడని రుచిచూడు
    ధన్యుడు తన్నాశ్రయించువాడు || సన్నుతింతు ||

    7. ఆకలెత్తు సింహపు పిల్లలకు
    ఆశ్రితుల కేమి కొదువలేదు || సన్నుతింతు ||
  • WhatsApp
  • Sep 15, 2021

    Saint Patrick | సెయింట్ పాట్రిక్

     సెయింట్ పాట్రిక్ | Saint Patrick

    • జననం : క్రీ.శ 387
    • మరణం : క్రీ.శ 490
    • స్వదేశం : బ్రిటను
    • దర్శన స్థలం : ఐర్లాండు

    తాను ఏ దేశపు సముద్రపు దొంగల చేత చెరపట్టబడి బానిసగా అమ్మబడ్డారో అదే దేశానికి సేవ చేయుటకు దేవుడు తనను తిరిగి తీసుకువెళ్తాడని పాట్రిక్ అప్పుడు ఎరిగియుండకపోవచ్చు . తన స్వస్థలమునకు దూరముగా , అత్యధికముగా అన్యదేవతలను పూజించే ఆ ఐర్లాండు దేశములో , తన యవ్వన కాలంలో విస్మరించిన మతాన్నే అతను ఎంతో పటిష్టముగా పట్టుకున్నారు . అతని తాతగారు ఒక పాదిరి , తండ్రి ఒక డీకన్ ( క్రైస్తవ సంఘ సేవలో సహాయక పరిచారకులు ) . అయినప్పటికీ , నిజమైన దేవునిని పాట్రిక్ ఎరిగియుండలేదు . అయితే , పరదేశానికి చెరపట్టబడిపోయిన ఆ సమయాన్ని అతనిని విశ్వాస మార్గములోనికి మళ్ళించుటకు దేవుడు వాడుకున్నాడు . ఆరు సంవత్సరాల తరువాత అక్కడి నుండి దేవుడు తనను విడిపించేంత వరకు కూడా , అతను తన సమయమును అత్యధికముగా ప్రార్థనలో వెచ్చించారు .

    ఏదేమైనప్పటికీ , బ్రిటనుకు తిరిగి వచ్చిన తరువాత అతను తిరిగి ఐర్లాండుకు వెళ్ళవలెనని ఒక దేవదూత అతనికి సూచిస్తున్నట్లు ఒక దర్శనము అతనికి కలిగింది . అయితే ఈ సారి చెరపట్టబడినవానిగా కాదు , ఒక మిషనరీగా . కాగా కొన్ని సంవత్సరాల పాటు మతపరమైన శిక్షణ పొందిన పిమ్మట కేవలం దేవుని మీదనే ఆధారపడి పాట్రిక్ ఐర్లాండుకు వెళ్ళారు . విగ్రహాలను మరియు అశుద్ధమైనవాటిని ఆరాధిస్తున్న ప్రజలను సత్యము వైపుకు మళ్ళించవలెనని అలుపెరుగని ఆసక్తితో అతను ఐర్లాండు అంతటా ప్రయాణించి సువార్తను ప్రకటించారు .

    ఐర్లాండులోని తెగల వ్యవస్థను గురించి అతను మునుపు ఎరిగియున్నందున , వారిని క్రీస్తు వైపుకు నడిపించుటకు ఒక ప్రత్యేకమైన వ్యూహాన్ని అవలంబించారు . అదేమనగా , మొదట తెగల నాయకులకు సువార్తను ప్రకటించి , తదుపరి వారి తెగవారిని ప్రభావితం చేయుటకు ఆ నాయకులను ప్రోత్సహించడం . ఈ పద్ధతిని అనుసరించుట ద్వారా అతను ఐర్లాండ్ అంతటా అనేక వేల మందికి బాప్తిస్మమిచ్చుటలో విజయవంతులయ్యారు . ఎంతో ధైర్యమును మరియు దీనత్వమును కలిగిన మిషనరీ పాట్రిక్ . ఆ ఐర్లాండు ద్వీపములో అతని ప్రాణాలకు ఎల్లప్పుడూ ఆపద పొంచియుండేది . అనేకమార్లు అతను అన్యదేవతలను పూజించే తెగ నాయకులచే బంధించబడ్డారు . కాగా ఆ ద్వీపమును విడిచి వెళ్లవలెనని అతనిలో ఎంతో కోరిక కలిగినప్పటికీ , దేవుని యొక్క చిత్తములో నిలిచియున్నట్లయితే ఈ భూమిపై అదే తనకు అత్యంత సురక్షితమైన ప్రదేశమని పాట్రిక్ తన హృదయమును దృఢపరచుకునేవారు . ' ఐర్లాండ్ కు అపొస్తలుడు ' అని పేరొందిన ఈ పాట్రిక్ , దేవుని దృష్టికి తనను దీనునిగా కనుబరుచుకొనినవారై , తన తుది శ్వాస వరకూ ఆ పరమ దర్శనమునకు అవిధేయులు కాలేదు . ప్రియమైన వారలారా , మిమ్ములను బాధించిన వారియొద్దకే తిరిగి వెళ్ళి , క్రీస్తు ప్రేమను వారికి పంచిపెట్టుటకు మీరు సిద్ధముగా ఉన్నారా ?
    " ప్రభువా , దీనత్వమును నాలో కలిగించి , మీ వాక్యమును ప్రకటించుటకు నన్ను బలపరచుము . ఆమేన్ ! "
  • WhatsApp
  • Aug 28, 2021

    Stella Franklin | స్టెల్లా ఫ్రాంక్లిన్

    స్టెల్లా ఫ్రాంక్లిన్  | Stella Franklin


    • జననం: -
    • మహిమ ప్రవేశం: -
    • స్వదేశం: అమెరికా సంయుక్త రాష్ట్రాలు
    • దర్శన స్థలము: భారతదేశం


     1896–97 మధ్య భారతదేశంలో సంభవించిన కరువు ఆ దేశం ఎదుర్కొన్న ఎంతో భయంకరమైన పరిస్థితులలో ఒకటి అని చెప్పవచ్చు. ఒకవైపు ఆకలి బాధతో, మరొకవైపు తెగుళ్ళతో ప్రజల మరణాల రేటు ఎంతో అధికంగా ఉన్న రోజులవి. ఆ సమయంలో సుమారుగా పది లక్షల మంది మరణించినట్లు అంచనా. భారతీయులు శ్రమలలో మునిగిపోయి కొట్టుమిట్టాడుతున్న అటువంటి సమయంలో వారి ఆత్మీయ మరియు భౌతిక అవసరతలను తీర్చుటకు దేవుడు అనేక మంది దైవభక్తి గల స్త్రీ పురుషులను లేవనెత్తాడు. అటువంటి వారిలో ఒకరే స్టెల్లా ఫ్రాంక్లిన్. 


     1895వ సంll లో భారతదేశానికి వచ్చారు స్టెల్లా ఫ్రాంక్లిన్. తన సోదరి జోసెఫా వలెనే తాను కూడా మిషనరీ ఉపాధ్యాయురాలిగా సేవ చేయుటకు స్టెల్లా సిద్ధపడ్డారు. అయితే భారతదేశంలో కరువు యొక్క తీవ్రత ఆమె పని తీరును మార్చివేసింది. అప్పటికే తన సోదరి సేవలందిస్తున్న స్థలములోనే, అక్కడ జరుగుతున్న సహాయక చర్యలలో పాలుపంచుకొనమని స్టెల్లాను కోరారు. కాగా ఆమె ప్రభుత్వం నిర్వహిస్తున్న ఒక అనాథాశ్రమము యొక్క బాధ్యతలు స్వీకరించి, వందలాది మంది పిల్లల సంరక్షణా వ్యవహారాలను చేపట్టారు. అక్కడ ఉన్న పిల్లలలో అనేకమందికి కరువు తీరిన తరువాత తిరిగి వెళ్ళుటకు ఇళ్ళు లేవు. అటువంటి పిల్లలను స్టెల్లా తన రెక్కల క్రిందకు తీసుకొని, వారికి ఆహారమిచ్చి పోషించి, విద్యను నేర్పించడమే కాక ఆత్మీయ ఆహారమును కూడా అందించారు.


     తదుపరి దామో అనే ప్రాంతంలో మహిళల మధ్య సువార్త పనిని ప్రారంభించారు స్టెల్లా. ప్రారంభంలో ఆమె తన అనాథాశ్రమంలోని పిల్లల యొక్క తల్లులను సంధించారు. సువార్త ప్రచారానికి వెళ్లినప్పుడు తాను వెళ్ళిన ప్రదేశంలో గుడారం వేసుకొని నివసించే ఆమె, తన వ్యక్తిగత భద్రతను గానీ లేదా సౌకర్యాన్ని గానీ ఏనాడూ లెక్క చేయలేదు. అటువంటి ఒక పర్యటనలో ఆమె దాదాపు డెబ్భై గ్రామాలను సందర్శించారంటే అది ఆశ్చర్యకరమైన విషయమే! ఆమె దర్శించిన ఆ గ్రామాలలో చాలా వరకు మునుపెన్నడూ ఏ సువార్తికులూ వెళ్ళనివి. ఆమె బైబిలు బోధించే విధానం అన్ని వర్గాల వారికీ వారి పరిస్థితులకు తగినట్లుగాను మరియు ఎంతో స్పష్టముగాను ఉండేది.


     1905వ సంll లో ఆమె విద్యా పరిచర్యను నియంత్రించుటకును మరియు పాఠశాల నిర్వహణను చేపట్టుటకును హర్దాకు వెళ్ళారు. తదుపరి బైబిల్ కళాశాలలో బోధించుటకు జబల్‌పూర్‌కు వెళ్ళిన ఆమె, పిమ్మట 1912వ సంll లో బాలికల బోర్డింగ్ పాఠశాలలో సేవలందించుటకుగాను ముంగేలికి వెళ్ళారు. ఆ పనిలోనే ఆమె తన పరిచర్య యొక్క మిగిలిన సంవత్సరములను గడిపారు. ఆమె ఎక్కడికి వెళ్ళినా సరే అక్కడి క్రైస్తవ సంఘములకు కావలసిన ఆలోచనలను అందించుటకును మరియు కుటుంబ వ్యవహారాలలో సలహాల కొరకును ప్రజలు ఆమెను ఆశ్రయించేవారు. ఆమె కలిగియున్న అద్భుతమైన బుద్ధిజ్ఞానములు మరియు కనికరముతో ఇతరులను అర్థము చేసుకొనగలిగిన వ్యక్తిత్వము ప్రతి స్థలములోనూ వారు ఆమెను ఆశ్రయించుటకు కారణమయ్యేవి.


    🚸 *ప్రియమైనవారలారా, నశించుచున్న ఆత్మల యొక్క ఆత్మీయ మరియు భౌతిక అవసరతలను తీర్చుటకు మీరు సిద్ధముగా ఉన్నారా?* 🚸


    🛐 *"ప్రభువా, నేను మీకు సేవ చేయునప్పుడు నా సౌకర్యము కొరకు నేను ఆశించకుండునట్లు నాకు సహాయము చేయుము. ఆమేన్!"* 🛐

    🙏🙏 *దేవునికే మహిమ కలుగునుగాక!* 🙏🙏

    *******


  • WhatsApp
  • Aug 26, 2021

    Stanley Dale | స్టాన్లీ డేల్

    Stanley Dale | స్టాన్లీ డేల్

    జననం: -

    మహిమ ప్రవేశం: 1968

    స్వస్థలం: ఆస్ట్రేలియా

    దర్శన స్థలము: పాపువా, ఇండోనేషియా


    న్యూ గినియాలోని పర్వతాలు ఆ ప్రాంతంలోని అత్యంత భయానకమైన తెగలలో ఒకటైన ‘యాలి’ అనే తెగకు నిలయంగా ఉన్నాయి. మూఢనమ్మకాలతో నిండియున్న ఈ తెగవారు నరమాంస భక్షకులు మరియు నరబలిని ఆచరించేవారు. వారిని కలిసినవారిలో అతి కొద్దిమంది మాత్రమే సజీవంగా బయటకు రాగలిగారు. ఇవన్నీ తెలుసుకున్న స్టాన్లీ డేల్ స్నేహపూర్వక స్వభావం లేని ఆ తెగలకు సిలువ సందేశమును తీసుకువెళ్ళవలెనని నిర్ణయించుకున్నారు.


    ఆస్ట్రేలియాకు చెందిన మిషనరీయైన స్టాన్లీ డేల్ మునుపు సైనికుడిగా పనిచేశారు. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో మొట్టమొదటి సారిగా న్యూ గినియా యొక్క ఎత్తైన పర్వత శ్రేణులను చూసిన అతను, ఏదో ఒక రోజు తిరిగి వచ్చి అక్కడి యాలి ప్రజలకు దేవుని ప్రేమాసందేశమును అందించవలెనని నిశ్చయించుకున్నారు. కాగా 1961వ సంll లో తన స్నేహితుడు బ్రూనో డి లీయుతో కలిసి ఆ ప్రజలను చేరుకొనుటకు సుదీర్ఘమైన మరియు అతి క్లిష్టమైన ప్రయాణమును ప్రారంభించారు స్టాన్లీ. మొదటిగా వారు ఒకరితో ఒకరు పోరాడుతున్న యాబీ మరియు కోబాక్ తెగలను కలుసుకున్నారు. ఒకరోజు స్టాన్లీ మరియు బ్రూనో ఆ ఇరుతెగలవారి మధ్య జరుగుతున్న పోరాటంలో చిక్కుకున్నారు. ఇరుతెగలవారు కూడా ఆ వ్యక్తులు తమ శతృ తెగకు చెందినవారని భావించి వారిని చంపుటకు ఆయుధములతో వారి యొద్దకు పరిగెత్తారు. అయితే, అక్కడి పరిస్థితిని శాంతింపజేయుటకు ప్రయత్నిస్తున్న స్టాన్లీ యొక్క ధైర్యమును చూసి ఆ గిరిజనులు ఆశ్చర్యపోయారు. దేవుడు దయచేసిన జ్ఞానముతో ఆ తెగల మధ్య శాంతిని నెలకొల్పారు స్టాన్లీ. ఒకరినొకరు చంపుకొనుటకు సిద్ధముగా ఉన్న ఆ ప్రజలు చివరకు క్షమాపణా భావముతో ఒకరినొకరు కౌగిలించుకున్నారు.


    ఎంతో క్లిష్టమైన అన్వేషణ తరువాత చివరకు స్టాన్లీ మరియు బ్రూనో యాలి తెగలను చేరుకొనగలిగారు. అయితే వారు ఆ తెగవారి భూభాగములో అడుగు పెట్టిన మరుక్షణం బాణాలు వారి పైకి దూసుకువచ్చాయి. తత్ఫలితముగా వారు తిరుగుముఖం పట్టవలసి వచ్చింది. ఏదేమైనప్పటికీ, యాలి ప్రజల జీవితములకు యేసు క్రీస్తు ప్రభువు అవసరమని విశ్వసించిన స్టాన్లీ, 1963వ సంll లో మరికొంతమందితో కలిసి ఆ ప్రాంతమునకు తిరిగి వెళ్ళారు. వారు యాలి భూభాగమును చేరుకున్నప్పుడు ఆ గిరిజనులు తమ గుడిసెలలో నుండి బయటకు వచ్చి, తమ బాణములను ఊపుతూ వారిని భయపెట్టారు. తన సహచరుల భద్రతను దృష్టిలో ఉంచుకుని భద్రతా స్థలమునకు తిరిగివెళ్ళవలెనని స్టాన్లీ వెనుదిరిగారు. అయితే వారు వెనుకకు తిరుగినప్పుడు వందలాది బాణాలు దూసుకువచ్చాయి. ఆ మొత్తం మిషనరీ బృందం తమ ప్రాణాలను కోల్పోయారు.


    కొన్ని సంవత్సరాల తరువాత స్టాన్లీ రక్తం చిందించిన ఆ భూభాగములోనే సువార్త కూడా వ్యాపించింది. స్టాన్లీ యొక్క కుమారుడు వెస్లీతో సహా ఇతర మిషనరీలు ధైర్యముగా ముందుకు అడుగులువేసి యాలి తెగను చేరుకుని, క్రీస్తు కొరకు వారిని సంపాదించగలిగారు. ఒకప్పుడు భయానకమైన తెగగా ఉన్న యాలి ప్రజలు ఇప్పుడు శాంతిని ప్రేమించే క్రైస్తవ సమాజముగా మారారు!


    🚸 *ప్రియమైనవారలారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థముకాదని యెరిగి ప్రభువు కార్యాభివృద్ధియందు మీరు ఆసక్తులై యుంటున్నారా?* 🚸


    🛐 *"ప్రభువా, అపాయకరమైన పరిస్థితులను ఎదుర్కొనవలసి వచ్చినా సువార్తను ప్రకటించుటకు ముందుకు సాగిపోవుటకు నాకు ధైర్యము దయచేయుము. ఆమేన్!"* 🛐

    *******

    🙏🙏 *దేవునికే మహిమ కలుగునుగాక!* 🙏🙏


  • WhatsApp
  • Shomolekae l షోమోలేకే

    షోమోలేకే  | Shomolekae

    • జననం: -
    • మహిమ ప్రవేశం: -
    • స్వస్థలం: ఆఫ్రికా
    • దర్శన స్థలము: ఆఫ్రికా

    కురుమన్‌లోని జాన్ మెకెంజీ అనే మిషనరీకి చెందిన పండ్ల తోటకు షోమోలేకే అనే బాలుడు సంరక్షకునిగా ఉండేవాడు. అతనికి ఆ మిషనరీ అంటే మక్కువ. అతని బోధనలు కూడా ఆ బాలుడు ఇష్టపడేవాడు. ఒకసారి ఆ తోటలోని తోటమాలి కొన్ని దొంగిలించబడిన పండ్లను షోమోలేకేకి తినమని ఇచ్చాడు. అయితే, దొంగతనం చేయడం తప్పు అని ఎరిగియున్న ఆ బాలుడు వెంటనే వాటిని తిరస్కరించాడు. ఆ సంఘటన వలన అతను ఆ మిషనరీ యొక్క నమ్మకాన్ని గెలుచుకోగలిగాడు. తదుపరి ఆ మిషనరీ అతనిని తన సంరక్షణలోకి తీసుకున్నారు.

    మిషనరీ సేవలో తనకు సహాయపడుటకు షోమోలేకేని ఉత్తర ఆఫ్రికాలోని షోషాంగ్‌కు తీసుకొనివెళ్ళారు మెకెంజీ. ధైర్యవంతుడైన యువకుడైన షోమోలేకే మెకెంజీ యొక్క మిషనరీ ప్రయాణాలలో అతని ఎద్దుల బండిని నడిపించేవారు. అది అంత సులభమైన పని కాదు. అతను ఒకేసారి పదహారు ఎద్దులను నిర్వహించవలసి ఉండేది మరియు అతను వాటిని తిన్నగా వంకర లేకుండా వెళ్ళేలా నడిపించాలి. షోషాంగ్‌లో విశ్వాసులు కూడుకొని దేవునిని ఆరాధించుటకుగాను ఒక క్రైస్తవాలయమును నిర్మించుటలో మెకెంజీకి సహకారమందించారు షోమోలేకే.

    కొంతకాలం తరువాత కురుమన్‌లో ఒక పాఠశాలను నిర్మించుటలో మెకెంజీకి తోడ్పడిన షోమోలేకే తాను కూడా ఆ పాఠశాలలో విద్యార్ధిగా చేరారు. అక్కడ అతను తన స్వజనులకు బోధకునిగా మరియు ఉపాధ్యాయునిగా ఉండునట్లు శిక్షణ పొందారు. శిక్షణ పూర్తయిన తరువాత అతను పిత్సాని అనే ప్రదేశంలో పరిచర్య చేశారు. అక్కడి ప్రజలకు అతను యేసు క్రీస్తును గురించి బోధించి లేఖనములను చదవడమును నేర్పించారు. అడవి మృగాల నుండి కలిగే ప్రమాదాలను లెక్కచేయకుండా ప్రమాదకరమైన నదులు మరియు సరస్సుల వెంట ప్రయాణిస్తూ, సువార్త ప్రకటించుటకు ఒక గ్రామం నుండి మరొక గ్రామానికి వెళ్ళేవారు షోమోలేకే. అలుపెరుగక ఎడతెగక చేసిన అతని పరిచర్య ద్వారా ఎంతోమంది స్త్రీ పురుషులు క్రీస్తు వైపుకు నడిపించబడ్డారు.

    షోమోలేకే తన ప్రజల ఆత్మీయ అభివృద్ధి కొరకు మాత్రమే కాదు, వారి సామాజిక అభ్యున్నతి గురించి కూడా భారమును కలిగియుండేవారు. అతను గిరిజనులకు మంచి సంస్కృతిని నేర్పించారు మరియు నీతినిజాయితీలతో డబ్బు సంపాదించుకొనవలెనని వారిని ప్రోత్సహించేవారు. స్థానిక భాషలో అతను ఒక కీర్తనల పుస్తకమును కూడా వ్రాశారు మరియు దేవునికి స్తుతిగీతములను పాడటను వారికి నేర్పించారు. ఆ పాటలను అక్కడి ప్రజలు బాగుగా నేర్చుకున్నారు. మహిళలు పొలాలలో పని చేస్తున్నప్పుడు కావచ్చు లేదా చిన్నపిల్లలు తమ పడవలలో వెళ్తూ తెడ్డు వేస్తున్నప్పుడు కావచ్చు లేదా పురుషులు చిత్తడి నీటిలో చేపలు పడుతున్నప్పుడు కావచ్చు, ఏ పని చేస్తున్నా వారు సంతోషంగా ఆ పాటలు పాడటం వినబడుతుంది. ఆ గ్రామం మొత్తం క్రీస్తులో నిజమైన సంతోషాన్ని కనుగొంది! ఎంత అద్భుతమది!

    🚸 *ప్రియమైనవారలారా, ఒక క్రైస్తవునిగా మీరు చేస్తున్న పనిని మీరు నిజాయితీగా చేస్తున్నారా?* 🚸

    🛐 *"ప్రభువా, నేను వెళ్ళే స్థలములన్నింటిలో నిజాయితీగల క్రైస్తవ జీవితమును కలిగియుండుటకు నాకు సహాయము దయచేయుము. ఆమేన్!"* 🛐

    🙏🙏 *దేవునికే మహిమ కలుగునుగాక!* 🙏🙏

  • WhatsApp
  • Aug 23, 2021

    Stutinthun stutinthun naa kaalochana | స్తుతింతున్ స్తుతింతున్

    యెహోవా నా స్వాస్థ్యభాగము నా పానీయ భాగము నీవే." కీర్తన Psalm 16:3-11

    పల్లవి : స్తుతింతున్ స్తుతింతున్
    నాకాలోచన కర్తయగు దేవుని
    రాత్రివేలలో నా అంతరింద్రియములు నాకు నేర్పున్

    1. నాదు స్వాస్థ్య పానీయ భాగము
    నా యెహోవా నీవే కాపాడెదవు
    మనోహర స్థలములలో పాలుకల్గెను - స్తుతింతున్ || స్తుతింతున్ ||

    2.శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కల్గెను
    సదాకాలము యెహోవాయందు నా
    గురిని నిల్పుచున్నాను గాన నేను - స్తుతింతున్ || స్తుతింతున్ ||

    3. నా కుడి పార్శ్వమందాయన యున్నాడు
    గాన కదల్చబడలేను ఎన్నడు
    అందుచేత నా హృదయ మానిందించును - స్తుతింతున్ || స్తుతింతున్ ||

    4. నా శరీరము సురక్షితంబుగా
    నివసించుచున్నది ఏలననగా
    నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనియ్యవు - స్తుతింతున్ || స్తుతింతున్ ||

    5. జీవముగల నీ మార్గమును
    నీవు నాకిల తెలియ జేసెదవు
    నీవే నా క్షేమాధారమని నిన్ను - స్తుతింతున్ || స్తుతింతున్ ||

    6. సర్వోన్నతుడా నీ సన్నిధిలో
    సంపూర్ణ సంతోష మెంతో గలదు
    నీ కుడిచేతిలో నిత్యసుఖములు గలవు - స్తుతింతున్ || స్తుతింతున్ ||
  • WhatsApp